Begin typing your search above and press return to search.

సిద్ధిఖీ కాల్పుల్లో చనిపోలేదు... దారుణంగా చంపేశారు !

By:  Tupaki Desk   |   30 July 2021 11:30 AM GMT
సిద్ధిఖీ కాల్పుల్లో చనిపోలేదు... దారుణంగా చంపేశారు !
X
ఆఫ్ఘనిస్తాన్‌ లో భద్రతా దళాలకు, తాలిబన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇండియా ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ చనిపోయాడని అందరికీ తెలిసిందే. అయితే, అతని మరణం వెనుక దాగి ఉన్న అసలు రహస్యాన్ని అమెరికాకు చెందిన ఓ మ్యాగజైన్ వెలుగులోకి తీసుకొచ్చింది. డానిష్ కాల్పుల్లో చనిపోలేదని, అతన్ని తాలిబన్లు పట్టుకొని ఉరి తీసి చంపారని వెల్లడించింది. డానీష్ కాల్పుల్లో చనిపోలేదని.. తాలిబన్లు పట్టుకొని దారుణంగా హత్యచేశారని అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇని‌స్టిట్యూట్‌ లో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్న మైఖేల్ రూబిన్ తమ మ్యాగజైన్‌ లో రాశారు.

అయితే తమ ప్రమేయం లేదని చెబుతూ.. డానిష్‌ మృతిపై తాలిబన్లు సంతాపం కూడా ప్రకటించారు. డానీష్ సిద్దిఖీ చనిపోయిన సమయంలో స్పిన్ బోల్డాక్ జిల్లాలోని కాందహార్ నగరంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అక్కడ ఆఫ్ఘన్ దళాలకు మరియు తాలిబన్లకు మధ్య జరుగుతున్న ఘర్షణలను కవర్ చేస్తుండగా డానీష్ గాయపడ్డాడు. దాంతో ఆయనను కొంతమంది ఆర్మీ సిబ్బంది స్థానికంగా ఉన్న మసీద్‌ కు తీసుకెళ్లారు. అయితే ఈ విషయం పసిగట్టిన తాలిబన్లు, మసీద్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు. డానీష్‌ తో పాటు ఉన్న ఆఫ్ఘన్ కమాండర్ మరియు మరో ముగ్గురు సిబ్బందిని బందించారు.

అయితే డానీష్‌ మీద జరుగుతున్న దాడిని అడ్డుకోబోయిన ఆఫ్ఘన్ అధికారులను చంపేశారు. అనంతరం డానీష్‌ ను విచారించారు. ఆయన ఐడీ కార్డు కూడా చెక్ చేశారు. ఆ తర్వాతే సిద్దిఖీని తీవ్రంగా కొట్టి, గన్‌ తో కాల్చి, ఆ తర్వాత ఉరి తీశారు అని రూబిన్ తన మ్యాగజైన్‌లో తెలిపారు. భారత ప్రభుత్వ సహకారంతో సిద్ధిఖీ మృతదేహం ఫొటోలు, వీడియోలు నేనూ కొన్ని పరిశీలించా. ఆయన తల చుట్టూ గాయాలున్నాయి. బహుశా ఆయన్ని కొట్టి హింసించి ఆపై కాల్పులు జరిపి చంపి ఉంటారని ఏఈఐ సీనియర్‌ రైటర్‌ మైకేల్‌ రుబెన్‌ అభిప్రాయపడ్డారు. సిద్ధిఖీని వేటాడి చంపాలన్న ఉద్దేశం తాలిబన్ల లో స్పష్టంగా కనిపిస్తోందని, అంతర్జాతీయ సమాజం-యుద్ధ నిబంధనలు, ఉల్లంఘనలు, శాంతిసామరస్యాలు లాంటివి వాళ్ల పరిధిలో లేవనే విషయం ‍స్పష్టమవుతోందని ఆయన ఆ కథనంలో రాశారు. దీనిపై తాలిబన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

ముంబైకి చెందిన డానిష్‌ సిద్ధిఖీ.. నేషనల్‌ రూటర్స్‌ మల్టీమీడియా టీం హెడ్‌ గా పని చేశారు. అరుదైన ఫొటోలతో అంతర్జాతీయ గుర్తింపును దక్కించుకున్నారు. రొహింగ్యా శరణార్థుల సంక్షోభాన్ని తన ఫొటోలతో కళ్లకు కట్టినట్లు చూపించి, 2018లో ఆయన పులిట్జర్‌ ప్రైజ్‌ అందుకున్నాడు. 2021 జులై 15న పాక్‌ సరిహద్దు వద్ద అఫ్ఘన్‌ సైన్యానికి-తాలిబన్లకు మధ్య జరిగిన పోరును కవర్‌ చేయడానికి వెళ్లిన ఆయన దారుణ హత్య గురయ్యారు.