Begin typing your search above and press return to search.

షాకింగ్ ట్విస్టు: విశాఖ ఎన్నారై ఫ్యామిలీ మరణం.. ప్రొఫెషనల్స్ పనేనా?

By:  Tupaki Desk   |   18 April 2021 3:55 AM GMT
షాకింగ్ ట్విస్టు: విశాఖ ఎన్నారై ఫ్యామిలీ మరణం.. ప్రొఫెషనల్స్ పనేనా?
X
ఏపీలో ఒకేరోజు.. ఒకే జిల్లాలో చోటు చేసుకున్న రెండు సంచలన మరణ ఉదంతాలు చోటు చేసుకోవటం తెలిసిందే. తన కుమార్తెను ట్రాప్ చేసి.. తనను అవమానాలకు గురి చేశారంటూ అప్పలరాజు అనే వ్యక్తి.. ఒక కుటుంబంలోని ఆరుగురిని అత్యంత దారుణంగా హతమార్చటం తెలిసిందే. కత్తి తీసుకొని.. అరేళ్ల చిన్నారి మొదలు అరవైఏళ్ల పెద్దాయన వరకు కత్తితో నరుక్కుంటా పోవటం తెలిసిందే. అదే రోజున.. విశాఖలోని అత్యంత ఖరీదైన అపార్ట్ మెంట్ లో ఒక ఎన్నారై కుటుంబం సామూహికంగా చనిపోవటం.. మిస్టరీ మరణాల్లో వారి కుమారుడు మానసిక పరిస్థితి సరిగా లేక కుటుంబాన్ని చంపుకొని.. ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా వార్తలు రావటం తెలిసిందే.

వాస్తవానికి అప్పలరాజు దారుణ హత్యోదంతంతో.. ఎన్నారై కుటుంబం మరణించిన ఉదంతం పెద్దగా ఫోకస్ కాలేదు. అదే సమయంలో.. మిస్టరీగా మారిన వారి మరణాల విషయంలో పోలీసులు ఒక అభిప్రాయానికి వచ్చేయటంతో.. మీడియా సైతం అదే కోణంలో వార్తలు రాసిందే తప్పించి.. మరో అడుగు ముందుకు వేయలేదు. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నారై కుటుంబానికి చెందిన వివరాలు.. వారి బ్యాక్ గ్రౌండ్ తో పాటు.. గతంలో ఆయన పని చేసింది ఎక్కడన్న విషయాన్ని వారి కుటుంబ సభ్యులు బయట పెట్టటంతో పాటు.. పలు అనుమానాల్ని వారు వ్యక్తం చేయటంతో.. ఈ ఇష్యూ ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. కొత్త సందేహాలకు తెర తీస్తోంది.

మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో మరణించిన కుటుంబ సభ్యుల మృతదేహాలను వారి సొంతూరైన విజయనగరం జిల్లా గంట్యాడకుతరలించారు. వారి అంత్యక్రియల్ని నిర్వహించారు. మరణించిన బంగారునాయుడు కుటుంబం ఆర్థికంగా.. రాజకీయంగా బాగా స్థిరపడింది కావటం..వారి కుటుంబ సభ్యులు కొత్త అనుమానాల్ని తెర మీదకు తేవటంతో.. వీరి మరణాలు మిస్టరీగా మారాయి. మరణించిన సుంకరి బంగారునాయుడు నాలుగేళ్ల క్రితమే విశాఖకు రావటం.. అంతకు ముందు బహ్రెయిన్ రాజు వద్ద పని చేసినట్లు చెబుతున్నారు. ఉద్యోగంతో పాటు.. పెట్రోల్ వ్యాపారం కూడా చేసేవారని.. కోట్లాది రూపాయిలతో లావాదేవీలు నడిపేవారని తెలుస్తోంది. ఆర్థికంగా బాగా స్థిరపడటంతో పాటు.. విశాఖ జిల్లాలో పలు చోట్ల భూములు.. స్థలాలు ఉన్నాయి. హైదరాబాద్.. విశాఖలో వారికి కోట్లాది రూపాయిలు విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు చెబుతున్నారు. వీటికి సంబంధించిన వివాదమే.. వారిని హత్యకు గురి చేసిందా? అన్న కోణంలో ఇప్పుడు విచారిస్తున్నారు.

వీరి మరణం వెనుక పెద్ద కొడుకు దీపక్ హస్తం ఉందన్న ప్రచారం సరికాదని.. ఆ అబ్బాయి మీద అలాంటి ముద్ర సరికాదంటున్నారు. తండ్రి బాగా స్థిరపడి ఉండటం.. తల్లి వైద్యురాలు కావటం.. పిల్లాడు సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న వేళ.. అతడిని మానసిక రోగి కింద ముద్ర వేయటం సరికాదంటున్నారు. ఇక.. వారు నివాసం ఉంటున్న లగ్జరీ అపార్టమెంట్ అయిన ఆదిత్య ఫార్య్చూన్ లోని ‘సి’ బ్లాక్ కావటం.. అక్కడ హత్య చేయటానికి అవకాశం ఉందని.. బయట వ్యక్తులు వచ్చే వీలుందని చెబుతున్నారు.

తన సోదరుడు కుటుంబాన్ని హత్య చేసి ఉండొచ్చని.. ఇది పక్కా ప్రొఫెషనల్స్ చేసి ఉంటారని చెబుతున్నారు. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. బంగారునాయుడు ఇంజనీర్ కాబట్టి.. అతడి ల్యాప్ టాప్ కోసం వెతుకుతున్నామని.. మరణించిన వారి శరీరాలపై ఉన్న కత్తిగాట్లను చూస్తే.. పక్కా ప్రొఫెషనల్స్ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరణించిన బంగారునాయుడు ఐదో తరగతి వరకు ఊళ్లోనే చదివి.. తర్వాత విజయనగరం ఆర్సీఎం స్కూల్లో చదివారని చెబుతున్నారు. ఆంధ్రావర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదివి.. పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ లో రూ.5వేలకు పని చేశారని గుర్తు చేసుకుంటున్నారు.

అనంతరం ఏంబీఏ పూర్తి చేసి ఏడాది పాటు మద్రాసులో పని చేశారని.. అనంతరం బహ్రయిన్ రాజుకు చెందిన కెమికల్ పరిశ్రమల్లో జాబ్ చేశారని.. 20 ఏళ్లు అక్కడే ఉన్నారని చెబుతున్నారు. ఆ సమయంలోనే బహ్రెయిన్ తెలుగు అకాడమీకి కార్యదర్శిగా పని చేశారని.. నాలుగేళ్ల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చేశారని వెల్లడించారు. దేశానికి తిరిగి వచ్చిన తర్వాత విశాఖలో ఒక పరిశ్రమనునిర్వహించారని.. వారికున్న భూములు.. ఆస్తుల పత్రాలు కనిపించటం లేదన్న కొత్త విషయాన్ని వారు చెబుతున్నారు. మొత్తంగా ఇదేదో కుటుంబంలో జరిగిన హత్యలన్నట్లు కాకుండా.. ప్రొఫెషనల్స్ చేసిన హత్యగా విచారిస్తే.. షాకింగ్ నిజాలు బయటకు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఏపీ పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.