Begin typing your search above and press return to search.

ఆడబిడ్డ నవ్విందని.. 2 నెలల చిన్నారిని చంపేసిందట

By:  Tupaki Desk   |   20 Jun 2021 6:00 AM GMT
ఆడబిడ్డ నవ్విందని.. 2 నెలల చిన్నారిని చంపేసిందట
X
గతంలో మరెప్పుడూ లేని రీతిలో బంధాలు.. అనుబంధాలు ఇప్పుడో అర్థం కాని ఫజిల్ గా మారుతున్నయి. కట్టుకున్న భార్యను భర్తను చంపటం పాత పద్దతైతే.. మొగుడ్ని పరాయి మగాడి కోసం గుట్టుచప్పుడు కాకుండా చంపేస్తున్న వైనాలు ఈ మధ్యన అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా చోటు చేసుకున్న దారుణానికి సంబంధించి.. అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. షాకింగ్ అంశం వెలుగు చూసింది.

రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ లో రెండు నెలల పసిబాబు హత్యకు గురి కావటం తెలిసిందే. అయితే.. దీనంతటికి కారణంగా బాలుడి మేనమామ భార్యనే కావటం గమనార్హం. పసిగుడ్డును అంత దారుణంగా చంపటానికి కారణం సొంతవాళ్లే కావటం సంచలనంగా మారింది. ఇంతకూ ఆమె ఎందుకా దారుణానికి పాల్పడిందన్న విషయంలోకి వెళితే మరోసారి షాక్ తప్పదు. అసలేం జరిగిందంటే..

అనాజ్ పూర్ కు చెందిన లతకు ఇబ్రహీంపట్నం దగ్గర్లోని నెర్రపల్లికి చెందిన తిరుమలేష్ తో పెళ్లైంది. వారి వివాహమైన పన్నెండేళ్లకు వారికి బాబు పుట్టాడు. దీంతో ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే ఆమె ఆడబిడ్డ లతకు అబార్షన్ అయ్యింది. తన పరిస్థితిపై ఆడబిడ్డ నవ్విందని.. థైరాయిడ్ ఉన్న వారికి త్వరగా గర్భం వచ్చే అవకాశం ఉండదంటూ శ్వేత మాటలతో తనను అవమానించిందని ఆమెపై పగను పెంచుకుంది.

పిల్లలు పుట్టకపోతే కలిగే బాధను లతకు తెలిసేలా చేయాలని దుర్మార్గంగా ఆలోచించింది. లేక లేక పుట్టిన పిల్లాడ్ని వారికి దూరం చేయాలని భావించింది. అందుకే.. బాలుడిని తల్లి పక్కలో నుంచి అపహరించి.. ఇంటిపైకి తీసుకెళ్లింది. బాలుడి ముక్కు.. ఛాతీ మీద అదిమి హత్య చేసే ప్రయత్నం చేసింది. అదే సమయంలో బాబు నిద్ర లేచి ఏడుపు మొదలుపెట్టాడు. దీంతో.. కంగారు పడిన శ్వేత బాలుడ్ని పక్కనే ఉన్న నీటి ట్యాంకులో వేసి ఐదు నిమిషాల తర్వాత పిల్లాడు చనిపోయాడని నిర్దారించిన తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఇంట్లోకి వెళ్లి తనకేమీ తెలీదన్నట్లుగా నిద్ర పోయింది.

నిద్ర లేచిన లత.. తన బిడ్డ కనిపించకపోవటంతో కంగారు పడింది. కుటుంబ సభ్యులతో కలిసి శ్వేత సైతం ఏమీ తేలీదనట్లుగా నటించింది. రంగంలోకి దిగిన పోలీసులు కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించారు. చివరకు వాటర్ ట్యాంక్ లో పిల్లాడ్ని గుర్తించారు. రెండునెలల పసిగుడ్డ ఇంటి పైకి వెళ్లటం సాధ్యం కాని నేపథ్యంలో.. ఇంట్లో వాళ్లే ఎవరో చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు.

విడివిడిగా ప్రశ్నించగా.. వారికి లత మీద అనుమానం కలిగింది. దీంతో.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. జరిగినదంతా చెప్పేసింది. ఆమె మాటలు విన్న పోలీసులు సైతం షాక్ తిన్నారు. శ్వేతను అరెస్టు చేసిన పోలీసులు.. ఆమెను రిమాండ్ కు తరలించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.