Begin typing your search above and press return to search.

గంటలో పెళ్లి అనగా పోలీసుల ఎంట్రీ.. అప్పుడేం జరిగిందంటే..

By:  Tupaki Desk   |   21 Nov 2020 9:10 AM GMT
గంటలో పెళ్లి అనగా పోలీసుల ఎంట్రీ.. అప్పుడేం జరిగిందంటే..
X
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో ఓ పెళ్లి అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆగిపోయింది. అప్పటివరకు కళ్యాణమండపంలో రిసెప్షన్‌ అట్టహాసంగా నిర్వహించారు. వధూవరుల బంధువులు 800మందికి పైగా వచ్చారు. వారందరితో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఫోటోలు తీసుకున్నారు. వచ్చిన వారంతా నవ వధూవరులకు ఆశీస్సులూ అందజేశారు. ఇక గంట లో పెళ్లి అనగా అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో ఉన్నట్టుండి కళ్యాణమండపంలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని పెళ్లికూతురు వారికి చెప్పడంతో పోలీసులు పెళ్లిని ఆపేశారు. వరుడి కుటుంబం చేసేదేమీలేక కళ్యాణమండపం వదిలేసి వెళ్లిపోయింది.పోలీసుల పంచాయితీ నడుమ ఆమె తన ప్రియుడి చెంతకు చేరింది.

కడపకు చెందిన ఓ యువతి చెన్నైలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తోంది. తన కొలిగ్ అయిన చెన్నై యువకుడిని లవ్ చేసింది.అయితే తల్లిదండ్రులకు ఆమె ఈ విషయం చెప్పలేదు.వారు చూసిన పెళ్లి సంబంధానికి ఓకే చెప్పింది.గుర్రంకొండకు చెందిన ఓ ఉద్యోగస్తుడితో వివాహం నిశ్చయించి శుక్రవారం ముహూర్తం పెట్టుకున్నారు. వధూవరుల కుటుంబాలకు చెందిన బంధుమిత్రులు స్థానిక కల్యాణ మండపానికి వచ్చారు. గురువారం రాత్రి రిసెప్షన్‌ కూడా నిర్వహించారు. పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతున్న సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పెళ్లికూతురికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని వేడుకను ఆపివేశారు.ఆమె ప్రియుడు తమిళనాడు పోలీసులకు, అక్కడి నుంచి కడప పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి ప్రవేశించి పెళ్లి వేడుకను నిలిపివేశారు.

ఉదయం 8 గంటల వరకు పంచాయితీ చేసినా నవ వధువు ప్రియుడితో వెళ్లడానికి మొగ్గుచూపింది. దీంతో పెళ్లికొడుకు కుటుంబీకులు బంధువులు కల్యాణ మండపం నుంచి వెళ్లిపోయారు. పోలీసులు నవ వధువును, వారి తల్లిదండ్రులను స్థానిక తహశీల్దార్‌ అమరనాథ్‌ ముందు హాజరుపరిచారు. వారి నుంచి వాంగ్మూలం తీసుకొన్న తహసీల్దార్‌ యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత చెన్నైకి చెందిన ఆమె ప్రియుడు తన స్నేహితులతో కలిసి గుర్రంకొండ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. పోలీసులు నవ వధువును, తల్లిదండ్రులు, ఆమె ప్రియుడికి అప్పగించి అక్కడి నుంచి పంపేశారు.