Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో మరో షాకింగ్ ఘటన.. సుత్తితో కొట్టి అత్యాచారం

By:  Tupaki Desk   |   13 Sep 2021 4:14 AM GMT
మహారాష్ట్రలో మరో షాకింగ్ ఘటన.. సుత్తితో కొట్టి అత్యాచారం
X
దారుణమైన అత్యాచార ఉదంతాలు ఒకటి తర్వాత ఒకటి వెలుగు చూస్తున్నాయి. నిర్భయ ఘటనను తలపించే ఉదంతం బయటకు వచ్చి.. షాకింగ్ గా మారిన వేళ.. తాజాగా మరో దారుణ అత్యాచార ఘటన బయటకు వచ్చి షాకింగ్ గా మారింది. ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న అత్యాచార ఉదంతాలు మహారాష్ట్ర ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తున్నాయి. తాజాగా జరిగిన అత్యాచార ఉదంతం నోట మాట రాని రీతిలో ఉండటం గమానార్హం.

శుక్రవారం రాత్రి షిర్డి నుంచి తన మిత్రులతో కలిసి పదిహేనేళ్ల బాధిత బాలిక ఇంటికి బయలుదేరింది. వారి ప్రయాణం మధ్యలో ఉండగా ఉల్హాస్ నగర్ రైల్వే స్టేషన్ వద్ద నిందితుడు 30 ఏళ్ల శ్రీకాంత్ గైక్వాడ్ వీరిని అడ్డగించాడు. తోడుగా నిలిచిన స్నేహితుల్ని బెదిరించాడు. అనంతరం బాలికను రైల్వే స్టేషన్ పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ సమయంలో బాలిక అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. సుత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. గాయాలపాలైన బాధిత బాలిక శనివారం ఉదయం తప్పించుకొని ఇంటికి చేరింది. తనకు జరిగిన దారుణం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో.. వారంతా కల్యాణ్ రైల్వే స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

తాజాగా నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధిత బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. వరుస అత్యాచార ఉదంతాలు వెలుగు చూడటంతో.. మహారాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.