Begin typing your search above and press return to search.

ఖాకీలకు షాకింగ్ మారిన ‘అకాడమీ’ కతలు.. రూ.80 లక్షల నోట్లు కాల్చేశాడట

By:  Tupaki Desk   |   14 Oct 2021 3:42 AM GMT
ఖాకీలకు షాకింగ్ మారిన ‘అకాడమీ’ కతలు.. రూ.80 లక్షల నోట్లు కాల్చేశాడట
X
సంచలనంగా మారిన తెలుగు అకాడమీకి చెందిన కేసులో రూ.64.05 కోట్లు పక్కదారి పట్టిన సంగతి తెలిసిందే. బ్యాంకులో భద్రంగా డిపాజిట్ల రూపంలో దాచేస్తే.. దాన్ని కొట్టేసిన వైనం నివ్వెరపోయేలా చేసింది. తీగ లాగితే డొంక కదిలినట్లుగా.. నిందితులంతా ఇప్పుడు బయటకు వచ్చినా.. వారు కొట్టేసిన కోట్లాది రూపాయిల్ని రికవరీ చేయటానికి ప్రయత్నిస్తున్న పోలీసులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెబుతున్నారు.

భారీగా కొట్టేసిన డబ్బుల్ని ఏం చేశారు? అన్న ప్రశ్నకు నిందితులు దాదాపు ఒకేలాంటి సమాధానం చెప్పటం గమనార్హం. ఎవరికి వారు తమ వద్ద డబ్బుల్లేవని.. వాటిని కాల్చేసినట్లుఒకరు చెబితే.. మరొకరు స్నేహితుడికి అప్పు ఇస్తే పత్తా లేకుండాపోయాడని.. మరొకరు గతంలో తాను చేసిన అప్పు భారీగా పెరిగిపోవటంతో.. దాన్ని తీర్చేసినట్లుగా ఇంకొకరు.. ఇలా కథల మీద కథలు చెబుతున్న వైనం విచారణ అధికారుల్ని నివ్వెరపోయేలా చేస్తోంది.

వారు ఇస్తున్న సమాధానాల్ని చూస్తుంటే.. రికవరీ కావటం కష్టమన్నట్లుగా మారిందని చెబుతున్నారు. అధికారులు అడిగే ప్రశ్నలకు ఏ మాత్రం పొంతన లేకుండా చెబుతున్న సమాధానాల్ని విన్నప్పుడు.. నిందితులు మానసికంగా బాగా బలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అమ్మ తోడు అంతా నిజమే చెబుతానంటూనే తెగ అబద్ధాల్ని చెప్పేస్తున్నట్లుగా పోలీసు అధికారులు చెబుతుండటం గమనార్హం.

తనకు మిగిలిన ముఠాతో సంబంధం లేదని.. జస్ట్ వారికి సహకరిస్తే కొంత మొత్తం ఇచ్చేశారని.. కొన్నాళ్లు ఇంట్లో ఉంచుకున్నాని.. తనకు వచ్చిన మొత్తంలో రూ.90లక్షలతో వైజాగ్ లో ఒక ప్లాట్ కొన్నానని.. మిగిలిన రూ.80లక్షల నోట్ల కట్టల్ని భయంతో తగలబెట్టేసినట్లుగా చెబుతున్న మాటలు పోలీసులకు అయోమయానికి గురి చేస్తున్నాయి. మరో నిందితుడు తన స్నేహితుడికి అవసరం అంటే తాను కొట్టేసిన మొత్తంలో రూ.20లక్షల అప్పుగా ఇచ్చానని.. ఆ తర్వాత నుంచి సదరు ఫ్రెండ్ పత్తా లేకుండా పోయాడని మరో నిందితుడు చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

మరో నిందితుడు మరింత వెరైటీ కథ చెప్పాడని చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం తాను చేసిన అప్పు చివరకురూ.50 లక్షలు అయితే.. తనకొచ్చిన వాటా మొత్తాన్ని దానికే కట్టేసినట్లుగా చెబుతున్నారు. నిందితుల మాటలు ఇలా ఉంటే వాస్తవాలు మరోలా ఉన్నాయని చెబుతున్నారు. చాలామంది ప్లాట్లు.. స్థలాలు కొన్నారని.. మరికొందరు తమ పిల్లల పేర్ల మీద ఫిక్సెడ్ డిపాజిట్లు చేసినట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మొత్తం పద్నాలుగు మంది నిందితుల నుంచి రూ.17 కోట్ల విలువైన స్థిరాస్తి పత్రాలు.. రూ.3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారని.. మరో రూ44 కోట్ల మొత్తానికి లెక్క తేలాల్సి ఉందని చెబుతున్నారు.