Begin typing your search above and press return to search.

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు షాక్

By:  Tupaki Desk   |   26 Feb 2021 1:21 PM GMT
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు షాక్
X
కలియుగ వైకుంఠ దైవం తిరుమలను సంవత్సరానికి ఒకసారైనా దర్శించే భక్తులు ఎంతో మంది ఉన్నారు. దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అయితే ఇక నుంచి తిరుమల ప్రయాణం భక్తులకు పెను భారం కానుంది. ఈ మేరకు టీటీడీ తీసుకున్న నిర్ణయం భక్తుల పాలిటశాపమైంది.

తిరుమలకు వెళ్లే వాహనాలన్నీ అలిపిరి వద్దనున్న టోల్ గేట్ మీదుగానే ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం టోల్ గేట్ వద్ద వసూలు చేస్తోన్న చార్జీలను టీటీడీ అధికారులు భారీగా పెంచడం ప్రజలకు శరాఘాతంగా మారింది.

సగటున రోజుకు 10వేలకు పైగా వాహనాలు ఈ టోల్ గేట్ మీదుగా తిరుమలకు వెళ్తుంటాయి. వీకెండ్ లో ఈ సంఖ్య ఇంకా భారీగా ఉంటుంది. ఆయా వాహనాల నుంచి అలిపిరి వద్ద టోల్ చార్జీలను వసూలు చేస్తుంటారు. ఈ మేరకు అక్కడ ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఇన్నాళ్లు నామమాత్రంగా చార్జీలను వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు ధరలను భారీగా పెంచారు.

ఇప్పటిదాకా కనిష్టంగా రూ.15 నుంచి రూ.100 వరకు ఉన్న టోల్ చార్జీలను భారీగా పెంచారు. ఇక నుంచి కార్లు జీపులు, టాటా ఏస్, ట్యాక్సీలు రూ.50 రూపాయలు చెల్లించాలి. గతంలో ఈ చార్జి కేవలం రూ.15 ఉండేది.

*ఇక మినీ బస్సుల.. మినీ లారీలకు రూ.100 చార్జి చేశారు. ఇంతకుముందు ఈ ధర రూ.50 ఉండేది.

ఇక బస్సులు, భారీ ట్రక్కులకు రూ.200 చేశారు. పాతచార్జి రూ.100 ఉండేది. బైకులకు టోల్ చార్జీ ఉండదని దాన్ని మాత్రం ముట్టుకోలేదు.

శ్లాబులు, వాహనాల వారీగా టోల్ గేట్ చార్జీలలో పెరుగుదల నమోదైంది. కనిష్టంగా 50 రూపాయలు.. గరిష్టంగా 200 రూపాయలను ఇకపై వసూలు చేస్తారు. పెంచిన ధరలు చూసి శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు.