Begin typing your search above and press return to search.

జనాగ్రహం అంటే ఏమిటో రియల్ గా చూసిన ఏపీ ఫైర్ మంత్రి

By:  Tupaki Desk   |   24 Nov 2021 7:32 AM GMT
జనాగ్రహం అంటే ఏమిటో రియల్ గా చూసిన ఏపీ ఫైర్ మంత్రి
X
సహనానికి ఒక హద్దు ఉంటుంది. నిత్యం రాజకీయమే తప్పించి మరింకేమీ పట్టించుకోని నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. రాజకీయం చేయొద్దని ఎవరూ అనటం లేదు కానీ.. పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న వేళ.. రాజకీయాన్ని కాసేపు పక్కన పెట్టేసి.. తమ గురించి ఆలోచించాలన్న భావన బాధితులకు రావటమే కాదు.. తమను పట్టించుకోని పాలకులపై ఫైర్ అయిన వైనమిది.

భారీ వర్షాలతో అనూహ్య వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చిత్తూరు.. కడప.. అనంతపురంతో పాటు నెల్లూరు జిల్లా కూడా తీవ్రంగా ప్రభావితమైంది. వరద కారణంగా వేలాది మంది నిరాశ్రయులు కావటమే కాదు.. భారీ వర్షాల కారణంగా బాదితులు దెబ్బ తిన్నారు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు తమకు పట్టనట్లుగా వ్యవహరించటం వారికి మంట పుట్టేలా చేసింది.

తాజాగా కొవూరు పర్యటనకు వచ్చిన మంత్రి అనిల్ కు.. స్థానిక ఎమ్మెల్యే ప్రసన్నపైనా ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి.. ఎమ్మెల్యేల కాన్వాయ్ ను అడ్డుకున్నబాధితులు.. తాము చచ్చామా? బతికి ఉన్నామా? అని చూసేందుకు వచ్చారా? అంటూ మండిపడ్డారు. తమను పరామర్శించేందుకు వచ్చిన ఏపీ అధికారపక్షనేతలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వాన్ని తాము ఇంతకు ముందెప్పుడూ చూడలేదన్నారు.

మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్న తీరు చూస్తే.. వరద సాయం విషయంలో ప్రభుత్వం ఎంతలా ఫెయిల్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది. ఒక్కసారిగా 5.5 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని ఎలా వదులుతారు? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ భారీ వర్షం కారణంగా ఇంత పెద్ద ఎత్తున వరద నీటిని వదిలే అవకాశం ఉన్నప్పుడు..ముందుగా ఎందుకు హెచ్చరించలేదని ప్రశ్నించారు.

ఇంత బాధ్యత లేకుండా వ్యవహరిస్తారా? అంటూ ఆగ్రహంతో నిలదీశారు. వరద సాయం విషయంలో సర్కారు ఫెయిల్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది. సాయం తర్వాత పరామర్శతో పాటు.. నష్ట నివారణ కోసం చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోలేదన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకు తన రాజకీయ ప్రత్యర్థులపైనే తీవ్రంగా మండిపడే మంత్రి అనిల్ కు జనాగ్రహం ఎంతలా ఉంటుందన్న విషయం తాజా ఎపిసోడ్ లో ఇట్టే అర్థమయ్యేలా ఉందన్న మాట వినిపిస్తోంది.