Begin typing your search above and press return to search.

షాకింగ్ నిర్ణయం..ఆదివారం నుంచి షిర్డీలో సాయిబాబా టెంపుల్ మూసివేత

By:  Tupaki Desk   |   18 Jan 2020 5:28 AM GMT
షాకింగ్ నిర్ణయం..ఆదివారం నుంచి షిర్డీలో సాయిబాబా టెంపుల్ మూసివేత
X
మీరు చదివింది అక్షర నిజం. నిత్యం లక్షలాదిమంది భక్తులు షిర్డీకి వెళ్లి దర్శించుకునే సాయిబాబా ఆలయాన్ని ఆదివారం నుంచి నిరవధికంగా మూసివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటన చేసింది మరెవరో కాదు.. స్వయంగా సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్. అంతేకాదు.. రానున్న రోజుల్లో ఏం చేయాలి? ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలన్న అంశం మీద కార్యాచరణ ప్రకటించేందుకు వీలుగా షిర్డీ గ్రామస్తులంతా కలిసి సమావేశం కావాలని కూడా డిసైడ్ అయ్యారు.

ఈ రోజు (శనివారం) ఇందుకు సంబంధించిన కీలకసమావేశం జరగనుందని చెబుతున్నారు. ఇంతకీ షిర్డీలో సాయిబాబా టెంపుల్ ను మూసివేయాలన్న నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? అన్న విషయంలోకి వెళితే.. బాబా తన పదహారో ఏట షిర్డీకి వచ్చి.. ఒక వేపచెట్టు కింద కూర్చున్నట్లుగా భక్తులు చెబుతారు. 1854లో ఆయన షిర్డీ వచ్చినట్లుగా పలువురు చెబుతారు. మరి.. సాయిబాబా ఎక్కడ పుట్టారన్న విషయానికి ఆయన పత్రి గ్రామంలో పుట్టారన్న వాదన ఎప్పటి నుంచో వినిపించేదే.

మరాఠ్వాడా ప్రాంతంలో షిరిడీకి 275 కిలోమీటర్ల దూరంలో పర్భణీ జిల్లాలోని పత్రి అనే ఊరు ఉంది. అదే షిర్డీ సాయి ఊరుగా చెబుతారు. ఇప్పుడా ప్రాంతాన్ని రూ.100 కోట్లతో డెవలప్ చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే చేసిన ప్రకటనపై నిరసనగా ఆలయాన్ని నిరవధికంగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్ట్ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆదివారం నుంచి ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తున్న మాట నిజమేనని ట్రస్టు సభ్యుడు బావుసాహెబ్ సైతం ధ్రువీకరించారు.

షిర్డీలో కొలువైన బాబాను ఏటా కోట్లాదిమంది దర్శించుకుంటారు. పత్రికి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా షిర్డీ ప్రత్యేకత తగ్గుతుందన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని సంస్థాన్ ట్రస్టు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ మాట్లాడుతూ.. పత్రిని షిర్డీతో సమానంగా డెవలప్ చేస్తానన్న మాట చెప్పారు. దీనిపై షిర్డీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

షిర్డీని కాదని పర్భణీకి సాయి మందిరాన్ని తరలించాలన్నదే ఉద్దవ్ సర్కారు కుట్ర చేస్తున్నట్లుగా ట్రస్టు మండిపడుతోంది. ఇందులో భాగంగా తొలిసారి ఆదివారం బంద్ కు పిలుపునిచ్చింది. సీఎం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆలాయన్ని మూసివేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఆ రోజున సాయిబాబా ఆలయంలోని అన్ని కార్యక్రమాల్ని నిలిపివేస్తున్నట్లుగా అనూహ్య నిర్ణయం తీసుకుంది.

దీంతో.. ఆదివారం షిర్డీకి వెళ్లాల్సిన భక్తులు.. వెళ్లాలా? వద్దా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది, తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. షిర్డీ స్థాయిలో పత్రిని డెవలప్ చేస్తే మాత్రం సదరు పత్రి గ్రామం షిర్డీ అయిపోదుగా? దేశంలో ప్రతి ఊళ్లోనూ షిర్డీ సాయి టెంపుల్ ఉంది.. అందులో కొన్నింటికి భక్తులు విపరీతంగా ఆదరిస్తుంటారు. అయినంతమాత్రాన.. షిర్డీ ప్రాధాన్యత ఇసుమంతైనా తగ్గిందా? పత్రిని ప్రత్యేకంగా చూస్తామని సర్కారు చెప్పినంతనే సంస్థాన్ ట్రస్టు ఇంత తీవ్ర నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందా? అన్నది క్వశ్చన్ గా మారింది.