Begin typing your search above and press return to search.

ప్రేమించిందని అమ్మ..అమ్మమ్మ కలిసి చంపేశారు

By:  Tupaki Desk   |   4 Dec 2021 2:23 AM GMT
ప్రేమించిందని అమ్మ..అమ్మమ్మ కలిసి చంపేశారు
X
కాలం మారింది. మనుషుల మైండ్ సెట్ లో మార్పు వచ్చిందని చెబుతున్నా.. కొన్నిచోట్ల చోటు చేసుకుంటున్న అనాగరిక ఉదంతాల్ని చూస్తే.. ఈ రోజుల్లోనూ ఇలాంటోళ్లు ఉన్నారా? అన్న భావన కలుగక మానదు.

తమ కులం కాని అబ్బాయిని ప్రేమించిందన్న కోపంతో.. తమ పరువు పోతుందని భావించి కన్న కూతుర్ని చంపేసుకుందో తల్లి. అల్లారు ముద్దుగా పెంచుకున్న పదిహేడేళ్ల కుమార్తెను అత్యంత పాశవికంగా చంపిన ఈ ఉదంతంలో అమ్మనే కాదు.. అమ్మమ్మ కూడా కీలక పాత్ర పోషించటం గమనార్హం.

ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని పర్వతగిరి మండల కేంద్రంలో ఉంటున్న ఎస్సీ వర్గానికి చెందిన సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు ఇప్పటికే పెళ్లి చేశారు. చిన్న కుమార్తె అంజలికి పదిహేడేళ్లు. పదో తరగతి చదువుతోంది.

సమ్మక్క భర్త అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మరణించాడు. దీంతో.. ఇంటి బాధ్యతను సమ్మక్క.. ఆమె తల్లి యాకమ్మలు చూసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా.. తమ గ్రామానికి చెందిన ఎస్టీ కులానికి చెందిన యువకుడితో అంజలికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. వారిద్దరూ సన్నిహితంగా ఉండేవారు.

ఈ విషయం తెలిసిన సమ్మక్క కుమార్తె అంజలిని మందలించింది. అయినప్పటికీ ఆమె తన తీరును మార్చుకోలేదు. కుమార్తె కారణంగా తమ పరువు పోతుందని భావించారు. తన తల్లి యాకమ్మతో కలిసి కుమార్తెను అంతమొందించాలని సమ్మక్క ప్లాన్ చేసింది. తొలుత ఇంట్లో ఉరి వేసి చంపాలని భావించారు. అయితే.. తాము చేసిన పని బయటకు వస్తే పోలీసులకు దొరికిపోతామని భావించి.. ఆ ఆలోచనను విరమించుకున్నారు.

ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు నిద్ర పోతున్న అంజలిని అమ్మ.. అమ్మమ్మలు ఇద్దరు కలిసి చంపాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నిద్ర పోతున్న అంజనిపై కూర్చొని.. ఆమెకు ఊపిరి ఆగకుండా చేసి చంపేశారు.

ఏమీ ఎరుగనట్లుగా పడుకున్నారు. తెల్లారి లేచిన తర్వాత పెద్ద ఎత్తున ఏడేస్తూ.. తన కుమార్తె నిద్ర లేవటం లేదని.. రాత్రి గొడవ జరిగిందని. నిద్ర మాత్రలు వేసుకుంటానని బెదిరించిందని.. ఇంతలోనే దారుణం జరిగిందని వాపోయారు.

పోలీసులకు సమాచారం అందటం.. వారు వచ్చి డెడ్ బాడీని పరీక్షలకు పంపారు. మృతురాలి గొంతుపై గోళ్లు గీసుకుపోయినట్లు గాట్లు ఉండటంతో అనుమానం వచ్చింది. దీనికి తోడు ముక్కునుంచి రక్తం కారటంతో పోలీసులు అనుమానంతో అనుమానాస్పద మరణంగా కేసునమోదు చేశారు.

ఫోరెన్సిక్ రిపోర్టు తెప్పించుకునే పనిలో ఉండటం.. పోలీసులు సైతం తల్లి మీద అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. దారుణానికి పాల్పడిన ఇద్దరు ఊరి పెద్ద మనిషి వద్దకు వెళ్లి తాము చేసిన దారుణం గురించి చెప్పేశారు. పరువు పోతుందని చంపినట్లుగా ఒప్పుకొని పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు.. హత్యానేరాన్ని నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.