Begin typing your search above and press return to search.

సంచలనంగా ప్రధాని మోడీ సొంత తమ్ముడు వ్యాఖ్యలు.. జీఎస్టీపై కొత్త రచ్చ

By:  Tupaki Desk   |   1 Aug 2021 4:24 AM GMT
సంచలనంగా ప్రధాని మోడీ సొంత తమ్ముడు వ్యాఖ్యలు.. జీఎస్టీపై కొత్త రచ్చ
X
దేశ పాలనా పగ్గాలు ఉండే వ్యక్తి కుటుంబ సభ్యుల హడావుడి ఒక స్థాయిలో ఉంటుంది. అందుకు భిన్నంగా ఉంటుంది పరధాని మోడీ కుటుంబ పరివారం. ఇప్పటివరకు దేశం చూసిన రాజకీయాలకు భిన్నమైన రాజకీయ అనుభవాన్ని మిగల్చటంలో మోడీ కుటుంబం ముందుందని చెప్పాలి. ప్రధానమంత్రి కుర్చీలో మోడీ కూర్చున్న నాటి నుంచి.. వారి కుటుంబానికి.. వారి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ప్రత్యేక గుర్తింపు కోసం పాకులాడలేదు. ఎవరికి వారు.. తమ మానాన తాము బతికేస్తుంటారు. ఇదంతా మోడీ గొప్పతనంగా పలువురు అభివర్ణిస్తారు కానీ.. అదంతా ఆయన కుటుంబ సభ్యుల గొప్పతనంగా చెప్పక తప్పదు.

ఎందుకంటే.. విలువలు, సిద్దాంతాల పేరుతో నిబంధనలు ఎన్నైనా రాసుకోవచ్చు. అనుకోవచ్చు. కానీ.. వాటిని అంతిమంగా పాటించాల్సిన బాధ్యత మాత్రం కుటుంబ సభ్యులదే. ఒకవేళ.. మోడీ ఎన్ని రూల్స్ కుటుంబానికి పెట్టినా.. వాటిని పట్టించుకోకుండా వ్యవహరిస్తే ఆయన మాత్రం చేసేదేముంటుంది? అందుకే.. విలువలతో వ్యవహరిస్తున్న మోడీ కుటుంబ సభ్యులు సాదాసీదా జీవితాన్ని గడిపేస్తుంటారు. ఇదంతా చూసినప్పుడు.. తమ ఇంటి వాడైన నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఉన్నప్పటికి అదేమీ పట్టించుకోకుడా మోడీ గొప్పతనం మీద ఆధారపడకుండా.. తమ మానాన తాము బతికే తీరును వారిని ప్రత్యేకంగా నిలుపుతుందని చెప్పాలి.

అలాంటి మోడీ కుటుంబ సభ్యుల నోటి నుంచి ఏదైనా కీలక వ్యాఖ్య ఏదైనా వస్తే.. నెలకొనే సంచలనం అంతా ఇంతా కాదు. తాజాగా అలాంటిదే ఒక ఉదంతం చోటు చేసుకుంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ సొంత తమ్ముడు ప్రహ్లాద్ మోడీ ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్ నగర్ లో వ్యాపారుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీలను తీవ్రంగా తప్పు పట్టారు.

మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. మనమేమీ బానిసలం కాదన్న ఆయన.. వ్యాపారుల గురించి ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. గుజరాత్ లో వ్యాపారానికి రసాయనాల వినియోగం అనుమతి ఉందని.. రసాయన వ్యర్థాల నిర్వహణకు సరైన ప్రణాళిక ఉందన్నారు. గుజరాత్ అనుమతి ఇస్తున్నప్పుడు మహారాష్ట్ర ఎందుకు ఇవ్వదని సూటిగా ప్రశ్నించిన ఆయన.. మోడీ సర్కారుపై ఘాటు విమర్శల్ని సంధించారు.

''మోడీ కావొచ్చు. మరొకరు కావొచ్చు. వారు మీ సమస్యల్ని వినాలి. మనమేమీ బానిసలం కాదు'' అని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీని చెల్లించబోమన్న విషయాన్ని ముందుగా తెలియజేయాలని కోరారు. ప్రధానమంత్రి సొంత తమ్ముడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రభుత్వ విధానాల మీద ప్రధాని సోదరుడు చేసిన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉందా? అన్నది ఇప్పుడు తొలిచేస్తున్న మరో ప్రశ్నగా మారింది.