Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ కు బాగుపడే లక్షణాలు అస్సలు కనిపించట్లేదుగా?

By:  Tupaki Desk   |   27 July 2021 12:30 AM GMT
టీ కాంగ్రెస్ కు బాగుపడే లక్షణాలు అస్సలు కనిపించట్లేదుగా?
X
కాంగ్రెస్ రాజకీయం అల్లాటప్పా అన్నట్లు ఉండదన్నది తెలిసిందే కదా. పార్టీ చేతికి అధికారం రాకున్నాఫర్లేదు..తమకు నచ్చని నేతకు మాత్రం పవర్ రాకూడదన్న విషయంలో కాంగ్రెస్ నేతలు చూపించే కమిట్ మెంట్ మరే ఇతర పార్టీలోనూ కనిపించదని చెబుతారు. కాంగ్రెస్ పార్టీని ఎవరో ప్రత్యేకించి ఓడించాల్సిన అవసరం ఉండదని.. వారిని వారే అనుక్షణం ఓడించుకునేలా ఒకరికి మించి మరొకరు ప్లాన్లు వేస్తుంటారని చెబుతారు. కాలం మారినా.. కాంగ్రెస్ నేతలు మైండ్ సెట్ మారలేదంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తిరుగులేని అధికారం తమకు శాశ్వితం అవుతుందన్న విషయం మీద కొందరు సీనియర్లు అధిష్ఠానం వద్దకు వెళ్లి చెప్పినప్పుడు.. వారి మాటల్ని సోనియమ్మ పెద్దగా విశ్వసించలేదని చెబుతారు.

అందుకే.. తెలంగాణ ఇవ్వటానికి ముందు పెద్దరికంతో టీఆర్ఎస్ ను పార్టీలో విలీనం చేయాలన్న మాటను చెప్పటం.. అందుకు కేసీఆర్ ను ఒప్పించటంలో జన్ పథ్ సక్సెస్ ఫుల్ గా వ్యవహరించిందని చెబుతారు. తెలంగాణ వస్తుందన్న ఆనందంలో కేసీఆర్ సైతం సర్లే.. కల సాకారమైంది.. పార్టీ ఉంటేనేం.. లేకపోతేనేం.. కాంగ్రెస్ లో విలీనం చేసినా.. చక్రం తిప్పేది తామే కదా? అన్నట్లుగా ఆలోచించారని చెబుతారు.

పార్టీ విలీనం మాట చర్చల్లో ఉండి.. కేసీఆర్ సందిగ్థంలో ఉన్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు కొందరు రంగప్రవేశం చేశారని చెబుతారు. పార్టీ చీఫ్ సోనియమ్మ వద్దకు వెళ్లి.. కేసీఆర్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఆయనకు.. ఆయన పార్టీకి పెద్దగా బలం.. బలగం లేదని.. ఆయన పార్టీలోకి రాకున్నా జరిగే నష్టం లేదని.. విభజన నేపథ్యంలో పార్టీ అఖండ విజయం సాధిస్తుందని.. కనుచూపు మేర తెలంగాణలో కాంగ్రెస్ తప్పించి మరే ఇతర పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరించరన్న మాట నమ్మకంగా చెప్పటమే కాదు.. అదే పనిగా చెవిలో జోరీగలా తమ వాదనను వినిపించినట్లు చెబుతారు.

ఈ కారణంతోనే అంత పెద్ద సోనియమ్మ సైతం వీరి మాటల్ని నమ్మి.. కేసీఆర్ మీద ఒత్తిడి పెట్టలేదని.. పార్టీ విలీనం తర్వాతే తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఉంటుందన్న మాటను గట్టిగా చెప్పలేదంటారు. విభజన జరిగిన తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. అప్పటివరకు సోనియమ్మ వద్ద తెగ చెప్పిన వారంతా చప్పుడు చేయకుండా ఉండిపోయారని చెబుతారు. కాలక్రమంలో ఎలాంటి పార్టీ మరెలా తయారైందన్నది తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ల కాలంలో పార్టీ గ్రాఫ్ అంతకంతకూ పడిపోవటమే కాదు.. తెలంగాణలో ఆ పార్టీ పని అయిపోయిందనే పరిస్థితికి వచ్చింది.

ఇలాంటివేళ.. భారీ కసరత్తు తర్వాత రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు ఇస్తూ నిర్ణయం తీసుకోవటం.. ఆ మాత్రానికే పార్టీలో ఒక కొత్త ఊపు.. ఉత్సాహం కొట్టొచ్చినట్లుగా కనిపించటం తెలిసిందే. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ ప్రమాణస్వీకారం మహోత్సవం అధికార టీఆర్ఎస్ నేతలు సైతం విస్మయానికి గురయ్యేలా ఉండటం గమనార్హం. అంతేనా.. ఇలాంటి వాటిని పిచ్చ లైట్ గా తీసుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం స్పందించటం చూస్తే.. తన ఎంట్రీతోనే రేవంత్ అంతో ఇంతో మార్పును అయితే తీసుకొచ్చారని చెప్పాలి.

చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్న కొత్త కళతో పలువురు నేతలు పార్టీలోకి తిరిగి రావటానికి ఉత్సాహం చూపించటం.. టీఆర్ఎస్ తమకు రాని అవకాశాలతో విసిగిపోయిన వారు.. కాంగ్రెస్ కండువా వేసుకోవటానికి తమ సంసిద్ధతను తెలుపుతున్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి మరోపార్టీకి ఎదురైతే.. హ్యాపీగా వచ్చే వారందరికి స్వాగతం పలుకుతూ మరింత హడావుడి చేస్తారు.కానీ.. టీ కాంగ్రెస్ సీనియర్లు మాత్రం అందుకు భిన్నమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చారట.

పార్టీలో చేరాలనుకునే వారి వివరాలు.. బయోడేటాను తీసుకొని వారిపై ఎంక్వయిరీ చేసిన తర్వాతే వారికి హామీలుఇవ్వటంతో పాటు.. పార్టీలో చేర్చుకోవాలన్న కండీషన్ పెడుతున్న వైనం గురించి తెలిసిన వారంతా విస్మయానికి గురవుతున్నారు. ఎక్కడైనా విపక్షంలో ఉన్న పార్టీ పవర్ లోకి రావటానికి ఏయే మార్గాలు ఉంటాయని ఉత్సాహంగా వెతుకుతారే తప్పించి.. ఇలా వెనక్కి లాగే పని చేయరంటున్నారు.

పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తిని చూపిస్తున్న బీజేపీ నేత ఎర్రశేఖర్.. టీఆర్ఎస్ నేత డి. సంజయ్.. భూపాలపల్లి నేత గండ్ర సత్యానారాయణరావులతో పాటు మరికొందరు తటస్థులు పార్టీలోకి వస్తానంటే.. అందుకు సవాలచ్చ కండీషన్లు.. శీల పరీక్ష చేస్తానని చెప్పటం చూసి విస్మయానికి గురవుతున్నారు. ఇందుకేనేమో.. కాంగ్రెస్ ను ఎవరో ఓడించక్కర్లేదు.. వారికి వారే ఓడగొట్టుకుంటారనేది.