Begin typing your search above and press return to search.

తెలంగాణలో అమ్ముకుని ఏపీలో కొంటున్నారు.. హరీశ్ చెప్పిన ఏపీ భూముల కథ!

By:  Tupaki Desk   |   16 May 2022 9:45 AM GMT
తెలంగాణలో అమ్ముకుని ఏపీలో కొంటున్నారు.. హరీశ్ చెప్పిన ఏపీ భూముల కథ!
X
ఒకప్పుడు భూమి అంటే వ్యవసాయానికి.. ఇంట్లో ఆడ పిల్లల పెళ్లికి కట్న కానుకగా మారింది.. తర్వాతి కాలంలో వ్యాపారమైంది. ఎప్పుడైతే పెద్దఎత్తున లావాదేవీలు మొదలయ్యాయో.. భూమి వ్యవహారం ఏకంగా రియల్ ఎస్టేట్ గా మారిపోయింది. అందులో లావాదేవీలు చేసేవారు రియల్టర్లుగా మారారు. ఏకంగా రియల్ ఎస్టేట్ సంస్థలే పుట్టుకొచ్చాయి. భూ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడిన కొన్ని సంస్థలు, వ్యక్తులను మినహాయిస్తే.. ఓవరాల్ గా భూమి ఈ రోజుల్లో బంగారమైంది. భూమిని నమ్ముకున్నోడు బాగుపడ్డాడు. అమ్ముకున్నోడు.. పద్ధతి లేనోడు గాడితప్పాడు. అది వేరే విషయం.

వైఎస్ హయాంలో ఎన్నడూ లేనంతగా

ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అనూహ్యంగా రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చింది. అంతకుముందు ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగాయి. 2005-2008 మధ్య కాలం నిజంగా భూ స్వర్ణ యుగమే. అయితే, వైఎస్ మరణానంతరం.. ఆ బూమ్ నిజంగానే బుడగలా పేలిపోయింది. ఆ తర్వాత చిరకాల స్వప్నమైన తెలంగాణ ఆకాంక్ష ఉద్యమ రూపంలో ఉవ్వెత్తున లేచింది.

రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్ధత నెలకొంది. కానీ, తెలంగాణ వచ్చాక పరిస్థితి అంతా మారిపోయింది. టీఆర్ఎస్ సర్కారు తొలి విడతలో రియల్ ఎస్టేట్ మళ్లీ నిలదొక్కుకుంది. టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్ వంటి విధానాలతో కేసీఆర్ సర్కారు రియల్ ఎస్టేట్ రంగానికి ఊపిరులూదింది. ఇక కాళేశ్వరం వంటి మెగా ప్రాజెక్టు రైతాంగానికి ప్రాణం పోసింది. చాలా జిల్లాల్లో ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టుల్లో కదలిక రావడంతో భూమికి మళ్లీ డిమాండ్ మొదలైంది.

2019 తర్వాత రాకెట్ వేగంతో..

ఉమ్మడి ఏపీ విభజన అనంతరం.. చంద్రబాబు పాలనలో ఉన్న ఆంధ్రపదేశ్ తొలి రెండేళ్లు హైదరాబాద్ నే రాజధానిగా నమ్ముకుని ఉండిపోయింది. పరిస్థితులు మారినట్లు గ్రహించిన చంద్రబాబు.. "అమరావతి" పేరిట ఏపీకి రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. పేరు బాగుండడం, మౌలిక వసతులకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించడంతో ఏపీలోనూ నిర్మాణ రంగ పరంగా కొంత ఊపు కనిపించింది. వాస్తవానికి చంద్రబాబు హయాంలో అమరావతిలో వసతులు, భవన నిర్మాణాలకు రూ.40 వేల కోట్ల వరకు ఖర్చు చేశారు.

కానీ, 2019 ఎన్నికల్లో ఆయన దారుణంగా ఓడిపోవడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్.. ఆర్నెల్లలోనే అమరావతి స్థానంలో మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారు. అయితే, ఆ వెంటనే కరోనా వ్యాప్తితో వ్యవస్థ స్తంభించింది. అసలు రాజధాని ఏదో తెలియని పరిస్థితుల్లో ఏపీ మిగిలిపోయింది. చివరకు హైకోర్టు నిర్ణయంతో అమరావతిలో ఇటీవల కొంత కదలిక కనిపిస్తోంది. దీన్ని పక్కనపెడితే.. ఏపీలో భూముల ధరల్లో ఏమాత్రం పురోగతి లేదు. రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకున్న వారు లాభాలను కళ్లజూడలేకపోతున్నారు. కానీ, ఇదే సమయంలో తెలంగాణలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడం ప్రారంభించాయి.

కేసీఆర్, కేటీఆర్ చెప్పేదిదే..

"రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్లండి. ఎకరం భూమి ఇప్పుడు రూ.20 లక్షలకు తక్కువ లేదు" తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పదేపదే చెబుతున్న మాట ఇది. కచ్చితంగా ఇందులో వాస్తవం ఉంది. సరిగ్గా ఐదేళ్ల కిందట ఎకరం రూ.5-6 లక్షలు ఉన్న తెలంగాణలో ఇప్పుడు రూ.20 లక్షలకు తక్కువలేదు. నాడు ఎకరం రూ.2-3 లక్షలు ఉన్నచోట ఇప్పుడు ఎకరం రూ.10 లక్షలైంది.

దీనినే టీఆర్ఎస్ సర్కారు పెద్దలు గర్వంగా చెప్పుకొంటున్నారు. తాజాగా తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు సైతం దీనికి కొనసాగింపుగా మరో మాట అన్నారు. తెలంగాణంలో భూమి ఏవిధంగా డిమాండ్ పలుకుతోందో ఇటీవల సిద్దిపేట జిల్లా పర్యటనలో చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఏపీలో ఎకరం అమ్ముకుని తెలంగాణకు వచ్చి ఐదెకరాలు కొనుగోలు చేసేవారు. ముఖ్యంగా క్రిష్ణా, గుంటూరు జిల్లాల వారు తెలంగాణతో పాటు కర్ణాటకలోని రాయచూరు, బళ్లారి వరకు వెళ్లి వ్యవసాయం చేసి అక్కడి వ్యవస్థలో భాగమైపోయారు.

అంతేకాక స్థానిక ప్రాంతాల ప్రగతికి తోడ్పడ్డారు. దీన్ని ఉదహరిస్తూనే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో "గుంటూరు పల్లెలు" అంటూ హరీశ్ ప్రస్తావించారు. ప్రస్తుతం మాత్రం తెలంగాణలో ఎకరం అమ్మి ఏపీలో 5 ఎకరాలు కొంటున్నారని హరీశ్ ప్రస్తావించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతికి ఇది నిదర్శనం అంటూనే.. పనిలో పనిగా తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి వరికోత యంత్రాలు వస్తున్నాయని పేర్కొన్నారు. అంటే, ఇక్కడ ధాన్యం దిగుబడి ఏస్థాయిలో ఉందో చెప్పకనే చెప్పారు.