Begin typing your search above and press return to search.

టీఆర్‌‌ఎస్‌కు ఝలక్‌.. రాజీనామా అస్త్రం

By:  Tupaki Desk   |   21 Sep 2020 3:30 PM GMT
టీఆర్‌‌ఎస్‌కు ఝలక్‌.. రాజీనామా అస్త్రం
X
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు విషయంలో ఇప్పటివరకు నెలకొన్న వివాదం తాజాగా దుమారం రేపింది. ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం ఆదేశించగా.. బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఆయన ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ టీఆర్‌‌ఎస్‌ అధిష్టానానికే ఝలక్‌ ఇచ్చారు. అంతేకాదు.. అధిష్టానం ఆదేశించినట్లుగా తాను ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయబోనంటూ ప్రకటించాడు.

పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచనల మేరకు ఈ నెల 20వ తేదీ వరకు రామకృష్ణ బోర్డు ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందిగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పత్రికా ముఖంగా వెల్లడించారు. ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రామకృష్ణ ఉపాధ్యక్ష పదవికి బదులుగా, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనికితోడు సోమవారం బోర్డు కార్యాలయంలో తన అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

రామకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా కంటోన్మెంట్‌ బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. టీఆర్‌‌ఎస్‌ పెద్దలు ఆదరించి ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారని చెప్పుకొచ్చిన రామకృష్ణ.. తోటి బోర్డు సభ్యుల్లో కొందరితో పొసగని కారణంగానే తాను టీఆర్‌ఎస్‌కు దూరం కావాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇంతకాలం తనకు సహకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, ఎమ్మెల్యే సాయన్నకు ధన్యవాదాలు తెలిపారు. అధిష్టానం నుంచి బుజ్జగింపులు వచ్చినా తన నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చన్నారు. వార్డు పరిధిలోని కార్యకర్తలు, తన అభిమానులతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

అయితే.. రామకృష్ణ టీఆర్‌‌ఎస్‌ పార్టీకి దూరం కావడంపై.. మిగిలిన ఏడుగురు సభ్యులు ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో భేటీ అయ్యాక, నేరుగా బోర్డు అధ్యక్షుడు అభిజిత్‌ చంద్రను కలిసి రాజీనామా సమర్పించనున్నట్లు బోర్డు సభ్యుడొకరు వెల్లడించారు. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగానే తాము నడుచుకుంటామని ఇంతకాలం రామకృష్ణకు మద్దతుదారులుగా నిలిచిన బోర్డు సభ్యులు అంటున్నారు. దీంతో కంటోన్మెంట్ బోర్డులో ఆసక్తికర రాజకీయం మొదలైంది.