Begin typing your search above and press return to search.

ఎక్కువసేపు కూర్చుంటే ఇక అంతే సంగతులు ... చూసుకోండి మరి !

By:  Tupaki Desk   |   31 July 2021 9:30 AM GMT
ఎక్కువసేపు కూర్చుంటే ఇక అంతే సంగతులు ... చూసుకోండి మరి !
X
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో చాలా మంది వర్క్‌ ఫ్రమ్‌ హోం వల్ల ఇతర కారణాలవల్లో ఎనిమిది గంటలకు పైగా కూర్చుని ఉంటున్నారని వెల్లడించారు. ఇది వారి మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని తెలిపారు. గంటల తరబడి కూర్చోవటం వల్ల శారీరకంగానే కాదు. మానసికంగా కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని తాజా పరిశోధనలో తేలింది. అంతేకాదు, వ్యాయామం ద్వారా కలిగే లాభాలను సైతం అది హరిస్తుందని ఇంగ్లాండ్‌ కు చెందిన యూనివర్శిటీ ఆఫ్‌ హర్డర్స్‌ ఫీల్డ్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వారానికి 150 నిమిషాల శారీరక శ్రమ చేసినప్పటికి ఎలాంటి లాభం ఉండదని వెల్లడించారు. దానినుంచి బయటపడాలంటే అంతకంటే ఎక్కువ సేపు వ్యాయామం చేయాల్సి ఉంటుందన్నారు. స్పోర్ట్స్‌ సైన్స్‌ ఫర్‌ హెల్త్‌ జర్నల్‌లో ఈ వివరాలను వెల్లడించారు. శాస్త్రవేత్త లియానే ఎజివెడో మాట్లాడుతూ..మేము 300 మందిపై పరిశోధనలు జరిపారు. వీరిలో 50 శాతంమంది ఎనిమిది గంటలకంటే ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారు. గంటల తరబడి కూర్చోవటం ఈ 50 శాతం మంది మానసిక ఆరోగ్య పరిస్థితి, సాధారణ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపింది. ఒకవేళ మీరు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు కూర్చుని పనిచేస్తుంటే, దాని ప్రభావం నుంచి బయట పడటానికి ఎక్కువ సేపు శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది.

ప్రతి రోజు 60 నిమిషాల వ్యాయామం మంచిది, కనీసం 30 నిమిషాల కంటే తక్కువ కాకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే జిమ్‌కు పోవటం అనే కాదు.. నడక, ఇతర పనులు చేయడం కూడా వ్యాయామమే. తోట పనులు చేసే వారు మానసికంగా, శారీరకంగా బాగున్నట్లు గుర్తించాం. కూర్చునే సమయాన్ని తగ్గించటం చాలా ఉత్తమం అని తెలిపారు. రోడ్ల మీద తిరిగి చేసే ఫీల్డ్‌వర్క్‌ కన్నా రోజంతా కుర్చీలో కూర్చుని పనిచేసుకునే ఉద్యోగమే బాగుంటుందని అనుకుంటారు చాలామంది. కానీ, ఇలా గంటలకొద్దీ కుర్చీకి అతుక్కుపోయేవారి జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోతుందంటున్నారు పరిశోధకులు. అమెరికాలో జరిగిన పరిశోధనలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి.

ఎక్కువ సమయం కూర్చుని ఉండేవారు డయాబెటిస్‌, గుండెపోటు వంటి సమస్యల బారిన పడటమే కాదు, వాళ్లకు మతిమరుపు కూడా వస్తుందంటున్నారు. రోజంతా కూర్చునే ఉండటం వల్ల మెదడులో జ్ఞాపకశక్తికి సంబంధించిన విభాగం దెబ్బతింటుందని ఈ పరిశోధనల్లో తేలింది. ఎప్పుడూ కూర్చుని ఉండేవాళ్ల మెదడులోని మీడియల్‌ టెంపోరల్‌ లోబ్‌ పొర పలుచబడుతున్నట్టు ఎంఆర్‌ ఐ పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఈ పొర దెబ్బతినడం వల్ల మతిమరుపు ఎక్కువై డిమెన్షియా వ్యాధికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒకసారి ఎంటిఎల్‌ పొర దెబ్బతిన్న తరువాత, ఎంత వ్యాయామం చేసినా తిరిగి యథాస్థితికి రావడం లేదు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే అల్జీమర్స్‌ వ్యాధికి కూడా కారణమవుతుందట.