Begin typing your search above and press return to search.

క్షీణించిన శశికళ ఆరోగ్యం..వెంటిలేటర్‌పై చికిత్స , పరిస్థితి విషమం

By:  Tupaki Desk   |   22 Jan 2021 6:17 AM GMT
క్షీణించిన శశికళ ఆరోగ్యం..వెంటిలేటర్‌పై చికిత్స , పరిస్థితి విషమం
X
దివంగత మాజీ సీఎం జయలలిత అత్యంత సన్నిహితురాలు , చిన్నమ్మ అలియాస్ శశికళ జైలు నుండి ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే శశికళ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో వీకే శశికళ కరోనా వైరస్ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బెంగళూరులోని లేడీ క్యూర్‌ జోన్‌ ఆస్పత్రిలో తొలుత చేర్చించారు. బుధవారం నుంచి అక్కడ చికిత్స పొందుతుండగా ఆమెకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో గురువారం శశికళను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న శశికళ ఆరోగ్యం విషమించినట్టు వైద్యులు తెలిపారు. ఆమెకు మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. శశికళకు ఐసీయూలోనే వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని,ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని పేర్కొన్నారు. జ్వరం, వెన్నునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న శశికళకు గురువారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. శశికళకు తొలుత యాంటిజెన్‌ పరీక్షల్లో కొవిడ్ నెగెటివ్‌గా వచ్చింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె జనవరి 27న విడుదల కానున్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండగా.. తన రాజకీయ పునరాగమనానికి ఆమె ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో శశికళ తీవ్ర అస్వస్థతకు గురికావడం, ప్రస్తుతం పరిస్థితి విషమించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకే పగ్గాలను చేపట్టి, ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో కథ అడ్డం తిరగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు, పన్నీర్ సెల్వం అడ్డం తిరగడం, క్యాంప్ రాజకీయాలతో అనూహ్యంగా పళనిసామి సీఎం అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో దోషిగా తేలిసిన శశికళ బెంగళూరు పరప్పన అగ్రహారం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇదే కేసులో శికళతో పాటు ఆమె బంధువులు ఇళవరసి, వీఎన్‌ సుధాకర్‌ 2017 ఫిబ్రవరి నుంచి పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

ఇదిలా ఉంటే .. శశికళ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, కర్ణాటక ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కుట్ర జరుగుతోందని అన్నా ద్రవిడర్‌ కళగం ప్రధాన కార్యదర్శి, ఆమె సోదరుడు దివాకరన్‌ ఆరోపిస్తున్నారు. మరో వైపు చిన్నమ్మ విడుద‌ల కోసం కొందరు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారీ ఏర్పాట్లను చేసింది ఓ వర్గం. జైలు నుంచి చెన్నైకి ఏకంగా వెయ్యి వాహ‌నాల‌తో వ‌స్తార‌నే ప్రచారం కూడా సాగుతోంది‌. అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చేయడానికి సిద్ధమయ్యారు. శశికళకు భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీవీ దినకరన్ అనుచరులు ఈ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.