Begin typing your search above and press return to search.

అప్పుడూ.. ఇప్పుడూ సజ్జన్నారే

By:  Tupaki Desk   |   6 Dec 2019 5:38 AM GMT
అప్పుడూ.. ఇప్పుడూ సజ్జన్నారే
X
సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ పేరు మరోసారి మారుమోగిపోతోంది. నిజాయితీ కలిగిన అధికారిగా.. ముక్కుసూటిగా వ్యవహరించే కర్ణాటకకు చెందిన ఐపీఎస్ అధికారి కొన్ని విషయాల్లో ఎంతో కఠినంగా ఉంటారని చెబుతారు. తన దగ్గర పని చేసే ఉద్యోగులు సజ్జన్నార్ గురించి.. ఆయన వ్యక్తిత్వం గురించి విపరీతంగా చెబుతారు. పెద్ద అధికారి అయినప్పటికీ చిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తపిస్తారని.. ఇలాంటి ఆఫీసర్ పోలీసు శాఖలో చాలా తక్కువన్న మాట వినిపిస్తోంది.

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ హత్యాచార ఉదంతంలో నిందితులు నలుగురిని ఎన్ కౌంటర్ చేయటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. దిశకు న్యాయం జరిగిందని దేశం నలుమూలల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ పై అభినందల వర్షం కురుస్తోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ బృందానికి సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు. దీంతో.. శబాష్ సజ్జన్నార్.. దటీజ్ సజ్జన్నార్.. సింగం సజ్జన్నార్ అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఎందుకిలా అంటే.. దీనికి కారణం లేకపోలేదు. దాదాపు పదకొండేళ్ల క్రితం అప్పటి ఉమ్మడి ఏపీలో వరంగల్ జిల్లాలో స్వప్నిక.. ప్రణీత అనే ఇద్దరు కాలేజీ అమ్మాయిలపై పట్టపగలు.. నడి రోడ్డు మీద యాసిడ్ దాడి జరిగింది. కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న వేళ శ్రీనివాస్ అనే వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. అతనికి మరో ఇద్దరు సహకరించారు. ఈ ఉదంతంపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. 2008 డిసెంబరు 10న జరిగిన ఉదంతంలో యాసిడ్ దాడికిపాల్పడిన శ్రీనివాస్ తో సహా అతనికి సహకారం అందించిన మరో ఇద్దరూ పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. ఆ సమయంలో వరంగల్ ఎస్పీగా వ్యవహరించారు సజ్జన్నార్.

తాజాగా జరిగిన దిశ హత్యాచార ఉదంతానికి వస్తే.. వెటర్నరీ వైద్యురాలిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితుల్ని బహిరంగంగా ఉరి తీయాలని.. కాల్చి చంపాలంటూ దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో నిందితుల్ని విచారణకు తీసుకొని విచారణ చేస్తున్న సమయంలో పారిపోయే ప్రయత్నం చేయగా నలుగురు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. అప్పుడు.. ఇప్పుడు సంచలన ఉదంతంలో నిందితుల ఎన్ కౌంటర్ లో బిగ్ బాస్ గా సజ్జన్నార్ నిలిచిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు.