Begin typing your search above and press return to search.

సజ్జల సత్యాలు : అవును కదా... నిజమే కదా...?

By:  Tupaki Desk   |   25 May 2022 3:44 PM GMT
సజ్జల సత్యాలు : అవును కదా... నిజమే కదా...?
X
ఆయన ఇంటిపేరులో మంచితనం ఉంది. ఆయనే సజ్జనుడు అయిన సజ్జల రామక్రిష్ణారెడ్డి. ఆయన సత్యమే చెబుతాను అని మీడియా ముందుకు వచ్చి ఎపుడూ తనకు నిజాలు అనిపించినవి అన్నీ చెబుతారు. అయితే ఆయన అందులో లాజిక్కులను మిస్ అయినవి బోలెడు ఉంటే ఉండొచ్చు కాక రాజకీయ మేధావిగా సజ్జలను మాటలను అలా వింటూంటారు అంతా.

ఇక సజ్జల లేటెస్ట్ గా ధర్మాగ్రహంతో మీడియా ముందుకు వచ్చారు. ఆ ఆవేశంతో చాలా సత్యాలు చెప్పారు. అందులో ఒక పాయింట్ ఏంటి అంటే కోనసీమ అల్లర్ల విషయంలో వైసీపీ వారే వైసీపీ మీద దాడులు చేయించుకున్నారు అన్న విపక్షాలకు కౌంటర్. మా సొంత పార్టీ వారి మీద మేము ఎందుకు దాడులు చేయించుకుంటాం. ఇది జరిగే పనేనా. చెప్పండి అంటూ సజ్జల చెప్పుకొచ్చారు.

అలా చేయించుకుంటే మాకు వచ్చే లాభం ఏంటి అని కూడా ఆయన తిరిగి విపక్షాలను అడిగారు. మా మంత్రి, మా ఎమ్మెల్యే, వారి మీద మేమే ఎందుకు దాడులకు దిగుతామండీ అని కూడా ఆయన చెప్పుకున్నారు. నిజమే. ఇది సత్యమైన సత్యమే కదా. ఇక చూస్తే ఆరోపణలు అన్నీ కోరస్ మాదిరిగా ఒకేలా ఉన్నాయని అంటూ టీడీపీ జనసేనలను కలిపి సజ్జల సార్ విమర్శలు చేశారు.

అంతే కాదు, విపక్షాల మాటలు, వారి విమర్శలు చూస్తూంటే వారే ఈ దాడులు చేయించారని అర్ధమవుతోందని మరో సత్యాన్ని కనుగొని అది కూడా మీడియాకు చెప్పేశారు. అడ్డగోలు విమర్శలు చేస్తూ మా మీద బురద జల్లాలని చూస్తున్న విపక్షాల తీరు మీద ఆయన మండిపడ్డారు.

అంతే కాదు, దాడులు అంతా పక్కా ప్లాన్ తోనే జరిగాయని ఆయన అన్నారు. ఈ విషయంలో ఒక్కొక్కరూ బయటపడుతున్నారని, ఎవరినీ తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదని పరమ సత్యాన్ని చెప్పారు. మొత్తానికి సజ్జల చెప్పిన వాటిలో చాలా సత్యాలు ఉన్నాయి. మరి అసలు సత్యం మాత్రం ఇంకా పోలీసులు చెప్పాలన్నది సజ్జల వారు గుర్తించాలి.

అవతల వారు అధికార పార్టీ మీద ఆరోపణలు చేస్తే సజ్జల వారు వారి మీద చేస్తున్నారు. మరి దాడులకు పాల్పడింది ఎవరు అన్నది పోలీసులతో విచారణ జరిపిస్తే వారు ఏ పార్టీ రంగూ రూపూ అన్నది కనుక తేల్చి జనం ముందు పెడితే అపుడు సజ్జల వారు చెప్పిన సత్యాలకు మరింతగా విలువ పెరుగుంది. ఇంతకీ కొసమెరుపు ఏంటి అంటే సజ్జల వారికి ఇది తెలియని సత్యం.

వైసీపీ వాళ్ళు దాడులు తమ సొంత పార్టీ వారి మీద చేయించుకుని ఉండకపోతే మరీ మంచిది కానీ. ఈ రోజున దేశంలో రాజకీయం అలాగే ఏడిచింది మరి. అందుకే ఈ ఆరోపణలు వస్తున్నాయి. నిజాన్ని నిగ్గు తీసి సత్యాన్ని బయటకు లాగి సజ్జల వారు అసలు దోషులను తెర ముందుకు తెస్తే కోనసీమ రావణకాష్టం వెనక ఉన్న అసలైన రావణులు ఎవరో తెలుస్తుంది. మొత్తానికి సజ్జల వారిది సత్యాగ్రహం. ధర్మాగ్రహం గానే చూడాలి.