Begin typing your search above and press return to search.

జగన్, పైలట్, సింధియాను వదలుకున్న కాంగ్రెస్ బతికిబట్టకలదా?

By:  Tupaki Desk   |   13 July 2020 7:50 AM GMT
జగన్, పైలట్, సింధియాను వదలుకున్న కాంగ్రెస్ బతికిబట్టకలదా?
X
కాంగ్రెస్ ఒక మహాసముద్రం.. అందులోనే అందరూ కలిసిపోవాలి.. ఆ పార్టీని ఎవరో వచ్చి ముంచేయరు.. ఆ పార్టీ నేతలే దెబ్బతీస్తుంటారు. 100 ఏళ్ల పార్టీ మారి. వృద్ధ జంబూకాలతో కళకళలాడే పార్టీలో యువతరం ఎదగడం లేదు. రాహుల్ గాంధీ ఎంత మొత్తుకున్న పోయిన ఎన్నికల వేళ సోనియా వినలేదు. బీజేపీలా సీనియర్లను పక్కనపెట్టలేదు. అందుకే ఇప్పుడు ఫలితం అనుభవిస్తోంది.

కాంగ్రెస్ కు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉన్న వేళ 2018 డిసెంబర్ లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలను గెలిపించాడు. మధ్యప్రదేశ్ లో సింధియాను, రాజస్థాన్ లో సచిన్ పైలెట్ ను సీఎం చేద్దామని అనుకున్నారు. సీనియర్లు అయిన అశోక్ గెహ్లాట్, కమల్ నాథ్ లను పక్కనపెట్టారు. కానీ సోనియా రంగ ప్రవేశం చేసి సీనియర్లకే పెద్దపీట వేసి జూనియర్లు సింధియా, పైలెట్ లను పక్కనపెట్టింది. వ్యతిరేకించిన రాహుల్ గాంధీని నోరుమూయించింది. ఫలితం ఇప్పుడు మధ్యప్రదేశ్ లో సింధియా వైదొలిగి ఆ రాష్ట్రం బీజేపీ వశమైంది. ఇప్పుడు రాజస్థాన్ లోనూ అదే కథ. సచిన్ పైలెట్ తిరుగుబాటుతో కాంగ్రెస్ సర్కార్ కూలుతోంది. ఇలా ప్రజల్లో పోరాడుతున్న.. ఫేం ఉన్న యువనేతలకు రాజకీయ అధికారం ఇవ్వకుండా వృద్ధ జంబూకాలను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ అథోగతి పాలవుతోంది. రాహుల్ చెప్పినా.. సోనియా ఇతర సీనియర్ల ధాటికి కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మాధవరావు సింధియా, రాజేష్ పైలట్, డాక్టర్. వై.యెస్.రాజశేఖర్ రెడ్డి ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలో సొంతంగా ఎదిగిన నాయకులు. ముగ్గురు కూడా ప్రజాదరణ కలిగిన నాయకులు. ముగ్గురిది సుదీర్ఘ ప్రజా రాజకీయ ప్రయాణం.

మాధవరావు సింధియా 9 సార్లు వరుసగా 1971 నుండి 1999 వరకు. ఓటమి లేకుండా లోకసభకి ఎన్నికయ్యారు. వైఎస్సార్ కూడా ఓటమి లేకుండా 1978 నుండి 2009 వరకు 4 సార్లు లోకసభకి, 6 సార్లు శాసనసభకి ఎన్నికయ్యారు. రాజేష్ పైలట్ 1980-2001 వరకు 6 సార్లు లోకసభ కి ఎన్నికయ్యారు. మాధవరావు సిందియా, రాజేష్ పైలట్ వివిధ ప్రభుత్వాలలో కేంద్ర మంత్రులుగా పనిచేసారు.

సిందియా, పైలట్, వైఎస్సార్ ముగ్గురు కాంగ్రెస్ లో యువ నాయకులుగా నాడు ఎదిగారు. ముగ్గురు కూడా మంచి వాక్చాతుర్యం, నాయకత్వ ప్రటిమ, అనుచర గణం కలిగిన ప్రతిభావంతమైన నాయకులు. కాంగ్రెస్ పార్టీలో ముగ్గురి ఎదుగుదలలో కూడా రాజీవ్ గాంధీ పాత్ర ఎంతో ఉంది.

ముగ్గురు కూడా తమ తమ రాష్ట్రాలలో సిందియా ( మధ్య ప్రదేశ్).. పైలట్ ( రాజస్థాన్).. వైఎస్సార్ ( ఆంధ్రప్రదేశ్) కాంగ్రెస్ పార్టీని ఎదిగేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు.. కాకపోతే సింధియా కానీ, రాజేష్ పైలట్ కానీ తమ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో ప్రధాన పాత్ర వహించలేకపోయారు. కానీ వైఎస్. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తన స్వయం కృషితో 2 సార్లు ( 2004, 2009 ) అధికారం లోకి తీసుకువచ్చారు. కానీ విధి విచిత్రం ముగ్గురు కూడా ప్రమాదవశాత్తు చిన్న వయసులోనే ( 60 ఏళ్ల లోపే) దుర్మరణం పాలయ్యారు. రాజీవ్ గాంధీ కూడా ప్రమాదవశాత్తు మరణించారు.

మళ్ళీ కాకతాలీయంగా ఆ ముగ్గురి వారసులు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోనే తమ రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. జ్యోతిరాదిత్య సిందియా, సచిన్ పైలట్ మళ్ళీ కేంద్ర మంత్రులయ్యారు. కాకపోతే జ్యోతిరాదిత్య , సచిన్ పైలట్ సుమారు 20 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉండి ఎన్నో అధికార పదవులు అనుభవించి కొన్ని కారణాల వల్ల పార్టీ అధిస్థానం మాటకు భిన్నంగా తమ వ్యతిరేక పార్టీ అయిన బీజేపీ తో చేతులు కలిపారు. తమ పార్టీ అధికారంలో ఉన్న మధ్య ప్రదేశ్, రాజస్థాన్ లో ప్రభుత్వాలు పతనమవ్వటానికి ముఖ్య కారకులయ్యారు.

కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను ఎంపిగా ఎన్నికైన రెండేళ్లలోనే 2011 కేంద్రంలో, రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మోసం చేయలేదు. ఏపీలో ప్రభుత్వాన్ని కూల్చలేదు. బయటకొచ్చి సొంతంగా ఎదిగాలనుకున్నారు. అప్పుడు దేశంలోనే తిరుగులేని నాయకురాలిగా కీర్తించబడుతున్న సోనియా గాంధీ నాయకత్వాన్ని ధైర్యంగా ఎదిరించారు. సిందియా, పైలట్ లాగా వ్యతిరేక పార్టీతో కుమ్మక్కై తమ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చలేదు. పూర్తిగా ప్రజా బలంతో, ప్రజాస్వామ్యయుతంగా ఎంత అణిచివేసినా తిరుగులేని ప్రజాదరణతో 2019లో అధికారం చేపట్టాడు. పై ఇద్దరి వారసులకి తనకు ఉన్న తేడాను చూపించాడు జగన్.

నాడు వైఎస్ఆర్ చనిపోగానే కడప ఎంపీ అయిన జగన్ కు కేంద్రమంత్రి పదవి ఇస్తామని.. సీఎం పదవిపై ఆశలు వదులుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసిందనే టాక్ ప్రచారంలో ఉంది.. కానీ తన నాన్న తీసుకొచ్చిన అధికారం.. వారసత్వాన్ని జగన్ కొనసాగించాలనుకొని జనం బాట పట్టారు. ఓదార్పుయాత్ర చేపట్టారు. దాంతోనే కాంగ్రెస్ కు కంటగింపుగా మారారు. ప్రజాదరణ ఉన్న వైఎస్ఆర్ ఫ్యామిలీని సోనియాగాంధీ నాటి సీనియర్ల చెప్పుడు మాట విని దూరం పెట్టింది. యువనేతలకు మద్దతుగా రాహుల్ గాంధీ ఎంత చురుకుగా స్పందించినా సోనియా మాత్రం వృద్ధ జంబూకాలకే పెద్ద పీట వేసి రాహుల్ నోరు మూయించింది. ఫలితం ఇప్పుడు పార్టీని యువ నేతలంతా వదలుతున్నారు. యువత లేక కాంగ్రెస్ కుదేలవుతోంది.

ఏది ఏమైనా ప్రజాదరణ ఉండి రాష్ట్ర స్థాయిలో నాయకత్వ లక్షణాలు ఉన్న శరద్ పవార్, మమతా బెనర్జీ.. సిందియా, పైలట్, వై.యెస్.జగన్ లాంటి యువ నాయకులను కోల్పోతున్న కాంగ్రెస్ తన ప్రాభవాన్ని పోగొట్టుకుని రోజురోజుకూ మరింత బలహీనమైపోతోంది.

చెప్పుడు మాటలు విని, చంద్రబాబు లాంటి వారి మాయలకు లొంగి జగన్ లాంటి ప్రజా నాయకుణ్ణి నాడు కాంగ్రెస్ కోల్పోయింది. ఇవాళా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత బలమైన రాష్ట్రం. కానీ నేడు ఇప్పుడు అదే రాష్ట్రంలో నామరూపాల్లేకుండా పోవడం స్వయంకృతాపరాధం.. సీనియర్లనే పట్టుకొని యువనేతలను వదిలేస్తున్న పాపానికి కాంగ్రెస్ అనుభవిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.