Begin typing your search above and press return to search.

రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం.. పతనం అంచున కాంగ్రెస్ సర్కార్

By:  Tupaki Desk   |   13 July 2020 4:30 AM GMT
రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం.. పతనం అంచున కాంగ్రెస్ సర్కార్
X
మధ్యప్రదేశ్ లో జరిగిందే రాజస్థాన్ లో రిపీట్ అవుతోంది. కాంగ్రెస్ వృద్ధ జంబూకాలను సీఎంలను చేసి గెలుపులో కీలక పాత్ర పోషించిన యువ నేతలను పక్కనపెట్టిన కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు ఆ పార్టీ యువనేతలు. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాధిత్య సింధియాలాగే ఇప్పుడు రాజస్థాన్ లో కాంగ్రెస్ యువనేత, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైల్ తిరుగుబాటు చేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చడానికి రెడీ అయ్యారు. ఆయన వెంట 30 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

రాజస్థాన్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడానికి రెడీగా ఉంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై యువ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ తిరుగుబాటు చేశారు. 30మంది ఎమ్మెల్యేలతో గుర్తు తెలియని చోట మకాం ఏర్పాటు చేశారు. నేడు సీఎల్పీ సమావేశానికి హాజరు కానని తేల్చిచెప్పారు. దీంతో కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలడానికి సిద్ధమైంది.

ప్రస్తుతం రాజస్థాన్ లో మొత్తం శాసనసభ స్థానాలు 200 ఉన్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజార్టీకి కొన్ని సీట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయి. దీంతో 10మంది స్వతంత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ 107మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మెజార్టీకి కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువగా ఉన్నారు.

ఇక బీజేపీకి 72మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఆర్ఎల్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతుంది. సచిన్ పైలెట్ బీజేపీలో చేరితే కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలి అధికారం బీజేపీ వశమవుతుంది. పరిణామాలు అలానే సాగుతున్నాయి.

ఇప్పుడు తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలెట్ వెంట 30 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరు చీలితే.. కాంగ్రెస్ బలం 77కు పడిపోతుంది. మైనార్టీలో పడి ప్రభుత్వం కూలుతుంది. ఈ 30మంది బీజేపీకి మద్దతిస్తే 102 ఎమ్మెల్యేలతో అధికారం బీజేపీ సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాజకీయం రసకాందాయంలో పడింది. సచిన్ పైలెట్ మొండిగా ఉండడంతో రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్ పతనం అంచున ఉంది.