Begin typing your search above and press return to search.

పైల‌ట్ వ‌చ్చేశాడు...కానీ ఎంత బాధ‌ప‌డ్డాడంటే

By:  Tupaki Desk   |   12 Aug 2020 2:30 AM GMT
పైల‌ట్ వ‌చ్చేశాడు...కానీ ఎంత బాధ‌ప‌డ్డాడంటే
X
ఎడారి రాష్ట్రం రాజ‌స్థాన్‌లో నెల‌కొన్న సంక్షోభానికి తెర‌ప‌డింది. కాంగ్రెస్ నేత‌, ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, అదే పార్టీకి చెందిన యువ నాయ‌కుడైన‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌తో విబేధాలతో రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. దాదాపు నెల‌రోజుల పాటు సాగిన ఈ డ్రామాకు సోమవారం ఫుల్ స్టాప్ ప‌డింది. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో సమావేశమై తన సమస్యలను స‌చిన్ పంచుకున్నారు. దీంతో సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనంత‌రం మీడియా మాట్లాడుతూ స‌చిన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

సీఎం గెహ్లాట్‌కు తనకు మ‌ధ్య‌ ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవ‌ని పైల‌ట్ స్పష్టం చేశారు. అయితే, రాజకీయాల్లో దుర్మార్గానికి లేదా వ్యక్తిగత శత్రుత్వానికి చోటు లేదని న‌ర్మ‌గ‌ర్భ కామెంట్లు చేశారు. ప్రియాంకజీ, రాహుల్‌జీ తమ మనోవేదనను ఓపికగా విన్నారని పేర్కొన్న‌ సచిన్ పైలట్ వాటిని పరిష్కరించడానికి రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తాము లేవనెత్తిన సమస్యలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అందుకే తాను, కొంతమంది ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని సచిన్ పైలట్ చెప్పారు.

20 ఏళ్ల రాజకీయ జీవితంలో తానెన్నడూ లక్ష్మణరేఖ దాటలేదని పైల‌ట్ చెప్పారు. వ్యక్తిగత దూషణలు చేయడం, కఠినమైన పదాలు వాడటం సరికాదని, ప్రజా జీవితంలో అలాంటివి ఉండకూడదని పేర్కొన్నారు. తనకు ఎలాంటి పదవి వద్దన్న సచిన్ పైలట్ అవి వస్తుంటాయి, పోతుంటాయని వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని, మనపై వారి నమ్మకాన్ని బలోపేతం చేసే దిశలో మనం పనిచేయాలని సచిన్ పైలట్ తెలిపారు. సీఎం గెహ్లాట్ వయసులో త‌న‌కంటే చాలా పెద్ద‌ వ్యక్త‌ని, ఆయనను చాలా గౌరవిస్తానని స‌చిన్ పైల‌ట్ పేర్కొన్నారు. రాజ‌స్థాన్‌లో సంక్షోభం కొన‌సాగుతున్న వేళ‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ చేసిన వ్యాఖ్యలు తననెంతో బాధించాయని యువనేత సచిన్ పైలట్ పేర్కొన్నారు. 'పనికిమాలిన వ్యక్తి, సర్కారును కూలదోయడానికి బీజేపీతో కలిసి కుట్రలు పన్నుతున్నాడు' అంటూ సీఎం గెహ్లాట్‌ చేసిన వ్యాఖ్యలు చాలా బాధ‌పెట్టాయ‌ని ఆయ‌న తెలిపారు. త‌న‌ కుటుంబం త‌న‌కు కొన్ని విలువలు నేర్పిందని, తాను ఎవరిని ఎంత వ్యతిరేకించినా అలాంటి భాషను మాత్రం ఎప్పుడూ ఉపయోగించలేదని పైల‌ట్ ఆవేద‌న వ్య‌క్తంచేశారు. పాల‌నాప‌రంగా త‌లెత్తిన‌ లోపాలపై గొంతెత్తే హక్కు తనకు పూర్తిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తద్వారా త‌న వైఖ‌రిని పైల‌ట్ మ‌రోమారు స్ప‌ష్టం చేశారు.