Begin typing your search above and press return to search.

జొన్నవిత్తుల పై కేసు నమోదు ..ఏం జరిగిందంటే?

By:  Tupaki Desk   |   2 Jun 2020 8:30 AM GMT
జొన్నవిత్తుల పై కేసు నమోదు ..ఏం జరిగిందంటే?
X
ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామ లింగేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ మహమ్మారి నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని తెలియజేస్తూ... అంతరాని తనాన్ని కొనసాగించేలా ఆయన పాడిన పద్యంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ మేరకు మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాం ప్రసాద్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నాంపల్లి పోలీసులు సోమవారం నాడు జొన్న విత్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

మార్చి 23న ఓ టీవీ చానల్ కార్యక్రమంలో పాల్గొన్న జొన్నవిత్తుల ఎస్సీ, ఎస్టీల మనోభావాలు కించపరిచేలా ఓ పద్యం పాడారని, అంటరానితనాన్ని కొనసాగించాలనే అర్థం ఆ పద్యంలో ఉందని అయన చెప్పుకొచ్చారు. అంటరానితనాన్ని కొనసాగించాలనేలా ఆయన మార్చి 23న కరోనాపై పద్యం పాడారని, ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి రోజునే ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేశారని బత్తుల రాంప్రసాద్‌ ఫిర్యాదు చేశారు

అతని రచనలు ఎస్సీ, ఎస్టీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. జొన్నవిత్తుల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే , దీనిపై స్పందించిన జొన్నవిత్తుల తాను తప్పుగా మాట్లాడలేదని.. నిజంగానే మానవ జాతి ఇప్పుడు ‘మడి’ కట్టుకుని ఉందని తాను ఒక జాతిని కాని, ఒక వర్గం వారిని ఉద్దేశించి పద్యం రాయలేదన్నారాయన. బ్రాహ్మణులు తమ కుటుంబాల్లో పాటించే మడి విధానం గురించే మాట్లాడాను అని తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని..అందులో తప్పుంటే శిక్షించవచ్చు అంటూ జొన్నవిత్తుల తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు.