Begin typing your search above and press return to search.

ఎస్బీఐ రీసెర్చ్: 3 వారాల్లో దేశంలో కరోనా కల్లోలం ఖాయం

By:  Tupaki Desk   |   19 Jan 2022 4:30 AM GMT
ఎస్బీఐ రీసెర్చ్: 3 వారాల్లో దేశంలో కరోనా కల్లోలం ఖాయం
X
మరో మూడు వారాల్లో దేశంలో కరోనా కల్లోలం ఖాయమని తేలింది. ఈ మేరకు తాజా నివేదిక భయపెడుతోంది. కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న సమయంలో పలు రకాల రీసెర్చ్ లు కోవిడ్ తీవ్రతను అంచనా వేస్తున్నాయి. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దేశంలో క్రమంగా కోవిడ్ మీటర్ జెట్ స్పీడుగా దూసుకెళుతోంది.

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా నిర్వహించిన అధ్యయనం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. భారత్ లో కోవిడ్ థర్డ్ వేవ్ వ్యాప్తి మూడు వారాల్లో గరిష్ట స్థాయికి చేరుతుందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనావేసింది. ఇప్పటికే కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది.

నగరాల్లో మొదలైన కోవిడ్ ఉధృతి ఇప్పుడు గ్రామాలకు కూడా పాకింది. అయితే ఈ తీవ్రత ఎక్కువ కాలం ఉండకపోవచ్చని.. వచ్చే మూడు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ట్ర స్థాయికి చేరుకోవచ్చన్నది ఎస్బీఐ అంచనా..

దేశంలోనే అత్యధికంగా ముంబైలో ఈనెల 7న 20971 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ సీజన్ లో ఇదే గరిష్ట్ర స్థాయి.. ముంబైలో కోవిడ్ కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరిన 2-3 వారాల్లో జాతీయ గరిష్టస్థాయి నమోదయ్యే అవకాశం ఉందని ఎస్బీఐ పేర్కొంది.

-ఎస్బీఐ నివేదిక

కోవిడ్ కేసులు తారాస్థాయికి చేరిన పలు దేశాల్లోని పరిస్థితులను ఎస్బీఐ పరిశీలించింది. యూఏఈ, చిలీ, సింగపూర్, చైనా తదితర దేశాలు 80శాతానికి పైగా జనాభాకు టీకాలు వేశారని.. దీంతో కొత్త కేసులు పెరుగుతున్నా మరణాల సంఖ్య తక్కువగా ఉందని పేర్కొంది. ఇక దక్షిణాఫ్రికా, యూఎస్ఏ, బ్రెజిల్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఇఫ్పటికే కరోనా థర్డ్ వేవ్ గరిష్ట్ర స్థాయికి చేరి మళ్లీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు తెలిపింది. ఈ దేశాల్లో గరిష్ట స్థాయి నమోదు కావడానికి సగటున 54 రోజుల సమయం పట్టిందని ఎస్బీఐ పేర్కొంది.

భారత్ లో కేసుల సంఖ్య పెరగడం డిసెంబర్ 29వ తేదీ నుంచి మొదలైంది. ఆ తర్వాత నెల 17వ తేదీకి వచ్చేసరికి రోజువారీ కేసుల సంఖ్య 2.38 లక్షలకు చేరింది. ఈ లెక్కన మూడు వారాల్లో కోవిడ్ గరిష్టస్థాయిని తాకుతుందని అంచనా వేసింది ఎస్బీఐ.

దేశంలో 64 శాతం ప్రజలకు ఇప్పటికే రెండో డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. మరోవైపు ప్రజలు పెద్ద ఎత్తున కోవిడ్ బారినపడగా.. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య మాత్రం తగ్గుతుంది. దీనికి వ్యాక్సినేషన్ కారణంగా చెబుతున్నారు.