Begin typing your search above and press return to search.

విరుచుకుపడటం ఓకే.. వరద బాధితులకు సాంత్వన వద్దా?

By:  Tupaki Desk   |   24 Nov 2021 9:30 AM GMT
విరుచుకుపడటం ఓకే.. వరద బాధితులకు సాంత్వన వద్దా?
X
అనుకోని రీతిలో కురిసిన వర్షాలకు ఆగమాగమైపోయిన పరిస్థితి. తమిళనాడుతో పాటు ఏపీలోని నాలుగు జిల్లాల్లో చోటు చేసుకున్న దారుణ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేటికి వరద పోటెత్తిన ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడని పరిస్థితి.

మిగిలిన సందర్భాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా.. పెద్దగా పట్టించుకోని ప్రజలు.. వరదలు లాంటి విపత్తులు విరుచుకుపడిన వేళ.. సాయం చేయటానికి దండు కట్టినట్లుగా ప్లానింగ్ ఉండాలి. ఈ విషయంలో వైసీపీ సర్కారు ఫెయిల్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది.

భారీ వర్షాలను ఆపే పరిస్థితి ఉండదు. విరుచుకు పడే విపత్తును కంట్రోల్ చేసేలా ప్లానింగ్ అవసరం. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి ఘోరంగా ఫెయిల్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. భారీ వర్షాలు.. వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వేళ.. తెలంగాణలో జరిగిన ఒక వివాహ వేడుకకు సీఎం జగన్ వెళ్లటం డ్యామేజింగ్ గా మారింది.

దీనికి తోడు.. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ను కలవటం.. కలిసి భోజనం చేయటం లాంటివి సైతం డ్యామేజ్ చేసేలా మారాయి. ఒకవైపు రాష్ట్ర ప్రజలు దారుణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాలికి బలపం కట్టుకున్న చందంగా తిరగటం.. వారికి అందాల్సిన సహాయక కార్యక్రమాల్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.

హుధూద్ లాంటి విపత్తు విరుచుకుపడి.. వైజాగ్ మొత్తం అతలాకుతలమైన వేళ.. నాడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు.. కలెక్టరేట్ లో బస్సును నిలిపి..అందులోనే ఉంటూ సమీక్షల మీద సమీక్షలు చేయటంతో పాటు.. దారుణంగా దెబ్బ తిన్న విశాఖ నగరాన్ని.. రోజుల వ్యవధిలోనే సాధారణ పరిస్థితికి తీసుకొచ్చారు.

అన్నింటికి మించి విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు కనీసం నెలపైనే పడుతుందన్న అంచనాల్ని వారం.. పది రోజుల్లోనే పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే. ఈ విషయాన్ని విశాఖ వాసులు ఎప్పటికి మర్చిపోలేరు.

సంక్షోభం వచ్చినప్పుడే పాలకుల సత్తా తెలుస్తుంది. తాజాగా కురిసిన భారీ వర్షాల వేళ.. అధికారుల్ని పరుగులు తీయించటం.. వరద కారణంగా జరిగిన నష్టం.. ప్రాణ నష్టం వీలైనంత తక్కువగా ఉండేలా చూడటం లాంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.

ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ప్రాణ నష్టం చోటు చేసుకోవటం చర్చగా మారింది. విపత్తు వేళ కష్టంలో ఉన్నప్రజల్ని ఆదుకోవటంలో వైసీపీ సర్కారు ఫెయిల్ అయ్యిందని.. ఇలాంటి సమయాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటే బాగుండేదన్న మాట పలువురి నోట వినిపించటానికి మించిన ఫెయిల్యూర్ ఇంకేం ఉంటుంది? ఎందుకిలా చేస్తున్నారు జగన్?