Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ల కోసం రూ.750 కోట్లు .. ఎగ్జిమ్‌ బ్యాంక్‌ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   27 Nov 2021 12:30 PM GMT
కరోనా వ్యాక్సిన్ల కోసం రూ.750 కోట్లు ..  ఎగ్జిమ్‌ బ్యాంక్‌ కీలక నిర్ణయం
X
కరోనా మహమ్మారి నివారణకు అత్యంత కీలకమైన కరోనా వ్యాక్సిన్‌ ఎగుమతి అవసరాలకు అనుగుణంగా కరోనా వ్యాక్సిన్‌, అందుకు అవసరమైన ఉత్పత్తుల తయారీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాక్సిన్‌, ఫార్మా కంపెనీలకు ఎక్స్‌ పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఇండియా ఎగ్జిమ్‌ బ్యాంక్‌) 10 కోట్ల డాలర్ల (దాదాపు రూ.750 కోట్ల) రుణ సాయాన్ని అందిస్తోంది. 6-7 కంపెనీలకు ఇప్పటికే ఈ మేరకు రుణాలను మంజూరు చేసినట్లు ఎగ్జిమ్‌ బ్యాంక్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ రమేశ్‌ తెలిపారు. ఇందులో హైదరాబాద్‌ కు చెందిన రెండు కంపెనీలు కూడా ప్రయోజనం పొందాయి.

భారత బయోటెక్నాలజీ, ఫార్మా కంపెనీలు ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాయి. సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ పొందేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. నూతన ఆవిష్కరణలకు హైదరాబాద్‌ హబ్‌గా ఎదిగిందని రమేష్‌ ప్రశంసించారు.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి దశలో ఉన్న కొన్ని సంస్థలను గుర్తించి, నిర్దిష్ట పథకం కింద వాటికి కావాల్సిన తోడ్పాటు అందిస్తున్నామని ఆయన వివరించారు. ఇప్పటికే మూడు సంస్థలకు సుమారు రూ. 70–100 కోట్ల దాకా సమకూరుస్తున్నట్లు రమేష్‌ పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి సంస్థలు మరో పదింటిని పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. ఉభర్‌తే సితారే పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద దేశవ్యాప్తంగా 30 సంస్థలకు, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి సుమారు 100 కంపెనీలకు తోడ్పాటు అందించనున్నట్లు రమేష్‌ చెప్పారు. ప్రస్తుతం ఎగ్జిమ్‌ బ్యాంక్‌ రుణ పోర్ట్‌ఫోలియో దాదాపు రూ. 1.1 లక్ష కోట్లుగా (ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి) ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 శాతం వృద్ధి నమోదు కాగలదని పేర్కొన్నారు.

ప్రభుత్వం నుంచి అందిన నిధుల ఊతంతో వచ్చే అయిదేళ్లలో దాదాపు 7 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఎగు మతి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలని నిర్దేశించుకున్నట్లు రమేష్‌ వివరించారు. ‘ఉభర్‌తే సితారే’ కార్యక్రమం కింద ఇన్నోవేషన్‌ ప్రాజెక్టులను చేపడుతున్న 100 కంపెనీలకు సాయం చేయాలనుకుంటున్నాం.

ఈ కార్యక్రమం కింద ఇప్ప టివరకూ హైదరాబాద్‌కు చెందిన 10 చిన్న కంపెనీలను గుర్తించాం. కాగా మొత్తం 100 కంపెనీలకు ఒక్కొక్క దానికి రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల రుణాలు సమకూర్చే వీలుందని రమేశ్‌ అన్నారు.