Begin typing your search above and press return to search.

కింజరాపు బ్ర‌ద‌ర్స్ పై రౌడీషీట్‌ ఓపెన్ !

By:  Tupaki Desk   |   23 Jun 2021 6:09 AM GMT
కింజరాపు బ్ర‌ద‌ర్స్ పై రౌడీషీట్‌ ఓపెన్ !
X
కింజరాపు .. ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు తెలుగుదేశం పార్టీలో ఓ అగ్ర‌నేత‌గాచక్రం తిప్పారు. అయితే , అయన అనుకోని విధంగా రోడ్డు ప్ర‌మాదంలో మరణించారు. ఇక ఎర్ర‌న్నాయుడు బ్రతికున్న సమయంలోనే త‌మ్ముడు కింజ‌రాపు అచ్చెన్నాయుడు రాజ‌కీయాల్లోకి రంగప్రవేశం చేశారు. రాజకీయాల్లో అన్న చాటు త‌మ్ముడిగా అంచలంచెలుగా ఎదుగుతూవ‌చ్చారు. అయితే , ఎర్ర‌న్నాయుడు మ‌ర‌ణానంత‌రం టీడీపీలో ముఖ్య నాయ‌కుడిగా, చంద్ర‌బాబుకు అత్యంత న‌మ్మ‌క‌మైన వ్యక్తిగా అచ్చెన్నాయుడు మారిపోయాడు. ఆ తర్వాత , అదే నమ్మకం తో చంద్రబాబు నాయుడు ఆయనకి ఏకంగా ఏపీ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వి కూడా అప్పజెప్పారు.

అయితే , అచ్చెన్నాయుడు ప్రత్యర్థుల పై విమర్శలు చేయడం లో ఏ మాత్రం అలసత్వం చూపరు. అలాగే ,ఈఎస్ ఐ కుంభ‌కోణం వ్యవహారంలో జైలుపాలు కావాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల సంద‌ర్భంగా త‌మ‌కు వ్య‌తిరేకంగా స్వ‌గ్రామం నిమ్మాడ‌లో స‌ర్పంచ్‌ గా నిలిచిన సోద‌రుడైన వ్య‌క్తిని బెదిరించిన కేసులో మళ్లీ జైలు గోడల మధ్యకి వెళ్లాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో కొంద‌రు కింజ‌రాపు సోద‌రుల‌తో పాటు అచ్చెన్నాయుడు అనుచ‌రుల‌ పై పోలీసులు రౌడీషీట్ ప్రస్తుతం తెర‌వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అచ్చెన్నాయుడు సోదరుడు కింజరాపు హరివరప్రసాద్, ప్రసాద్‌ కుమారుడు కింజరాపు సురేష్, అనుచరుడు కింజరాపు కృష్ణమూర్తి పై రౌడీషీట్‌ నమోదు చేసినట్లు శ్రీ‌కాకుళం జిల్లా టెక్కలి సీఐ ఆర్‌.నీలయ్య, కోటబొమ్మాళి ఎస్‌ఐ రవికుమార్‌ వెల్లడించారు.

కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామానికి చెందిన కింజరాపు హరివరప్రసాద్, కింజరాపు సురేష్, కింజరాపు కృష్ణమూర్తి తదితరులను పలు కేసుల్లో నిందితులుగా చేర్చి , బైండోవర్ చేశామ‌ని, బైండోవర్ నిబంధ‌న‌లు ఉల్లంఘించడంతో రౌడీషీట్‌ తెరిచినట్లు పోలీసులు చెప్తున్నారు. రౌడీషీట్‌ తెరిచేందుకు కార‌ణ‌మైన ప‌లు కేసుల వివ‌రాల‌ను టెక్కలి సీఐ, కోటబొమ్మాళి ఎస్‌ఐ వెల్ల‌డించారు. 2008లో నిమ్మా డ‌లో కింజ‌రాపు గ‌ణేష్‌, అత‌ని కుమార్తెపై దాడి, అలాగే 2010లో అదే గ్రామానికి చెందిన మెండ పోత‌య్య‌పై దాడిపై కేసులు న‌మోద‌య్యాయి. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిమ్మాడకు చెందిన బమ్మిడి లక్ష్మి అనే మహిళ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నామినేషన్‌ వేశారు. దీనితో కింజరాపు కృష్ణమూర్తి తదితరులు బమ్మిడి లక్ష్మిపై బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు. 2021లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నియోజకవ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త దువ్వాడ శ్రీ‌నివాస్‌, నిమ్మాడ వైసీపీ త‌ర‌పు సర్పంచ్ అభ్య‌ర్థి కింజరాపు అప్పన్నల‌పై హత్యాయత్నంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల విధులకు భంగం కలిగించిన కింజరాపు హరివరప్రసాద్, ఆయన కుమారుడు కింజరాపు సురేష్‌ లపై కేసులు ఫైల్ చేశారు. ఈ నేప‌థ్యంలో బైండోవ‌ర్ కేసుల్లో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన కార‌ణంగా రౌడీషీట్ ఓపెన్ చేసిన‌ట్టు పోలీస్ ఉన్న‌తాధికారులు తెలిపారు. భవిష్యత్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు వారి పై రౌడీషీట్‌ నమోదు చేసినట్లు సీఐ, ఎస్‌ఐలు తెలిపారు.