Begin typing your search above and press return to search.

పొత్తుపై పవన్ కు రోజా పంచ్ మామూలుగా లేదుగా?

By:  Tupaki Desk   |   18 Jan 2020 5:46 AM GMT
పొత్తుపై పవన్ కు రోజా పంచ్ మామూలుగా లేదుగా?
X
మొన్నటివరకూ కమలనాథులపై కస్సుబుస్సులాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఉన్నట్లుండి ఢిల్లీకి వెళ్లి రెండు రోజుల పాటు అక్కడే ఉండి.. నడ్డాను కలిసి బీజేపీతో పొత్తు గురించి ఫైనల్ చేసుకోవటం తెలిసిందే. ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీతో పొత్తు గురించి ఫైనల్ చేసుకున్నప్పుడు.. దానికి సంబంధించిన ప్రకటన పెద్ద ఎత్తున ఉండటమే కాదు.. దానికి సంబంధించిన కార్యక్రమాన్ని భారీగా ఏర్పాటు చేస్తారు.

కానీ.. అందుకు భిన్నంగా పవన్ పొత్తు ఉండటం ఒక విశేషమైతే.. ఆయన తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా బీజేపీతో పవన్ పొత్తుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దుమ్మెత్తి పోశారు. పవన్ కల్యాణ్ ను పొత్తుల కల్యాణ్.. ప్యాకేజ్ కల్యాణ్ అని చెప్పుకుంటారని.. అలాంటి ఆయన ప్యాకేజీల కోసమే పార్టీ పెట్టినట్లుగా ఆరోపించారు.

పొత్తులు పెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకుంటారన్న ఆమె.. ఈ కారణంతోనే పవన్ ను రెండుచోట్ల ప్రజలు ఓడించారన్నారు. ఇలాంటి వారితో పొత్తులు పెట్టుకోవాలని బీజేపీ పెద్దలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తనకు అర్థం కావటం లేదన్నారు. పవన్ తో పొత్తు అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదడమేనని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పవన్ పొత్తుపై రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.