Begin typing your search above and press return to search.

భారత టెస్ట్ కెప్టెన్ గా అతడే.. బీసీసీఐ నిర్ణయం?

By:  Tupaki Desk   |   17 Jan 2022 1:30 PM GMT
భారత టెస్ట్ కెప్టెన్ గా అతడే.. బీసీసీఐ నిర్ణయం?
X
టీమిండియా టెస్ట్ సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత క్రికెట్ ప్రేమికుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే. నెక్ట్స్ ఎవరు టీమిండియా కెప్టెన్ అని.. ఇప్పటికే టీ20లు, వన్డేలకు కెప్టెప్ అయిన రోహిత్ శర్మకే పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతున్నా.. వయసు మీదపడ్డ రోహిత్ కంటే భవిష్యత్ దృష్ట్యా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లు బెటర్ అని వారి పేర్లు తెరమీదకు వస్తున్నాయి.

అయితే వయసు, ఫిట్ నెస్ రీత్యా బీసీసీఐ రోహిత్ శర్మకంటే యువకుల వైపు మొగ్గు చూపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాలు సైతం రిషబ్ పంత్ బెటర్ అని.. కోహ్లీ స్థానాన్ని అతడే భర్తీ చేయగలడని అంటున్నారు.

ఈ క్రమంలోనే కొత్త కెప్టెన్ విషయంలో ఈ ముగ్గురిలో ఎవరు పగ్గాలు చేపడుతారనే విషయం ఆసక్తికరంగా మారింది.అయితే బీసీసీఐ మాత్రం కెప్టెన్సీ విషయంలో పూర్తి క్లారిటీతో ఉంది. టీ20, వన్డేలతోపాటు టెస్ట్ కెప్టెన్సీ కూడా రోహిత్ శర్మకే అప్పగించాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

ఈ మేరకు బీసీసీఐ వర్గాలు స్పందించారు. టీమిండియా టెస్ట్ కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు తనకు వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ లభించింది. ఇప్పుడు తనే కెప్టెన్ గా ఉండబోతున్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని బీసీసీఐ తెలిపింది. సౌతాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత ఈ మేరకు అధికారికంగా ప్రకటన వెలువడుతుందని సమాచారం.

ఇక వైఎస్ కెప్టెన్ విషయంలోనూ బీసీసీఐ దూరదృష్టితో ఉంది. భవిష్యత్ కెప్టెన్ కాబోయే ఆ వ్యక్తి ఎవరనేదానిపై ఆసక్తి నెలకొంది. ఈ విషయంలో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ముందున్నారు. వీరిని సారథులుగా తీర్చిదిద్దే క్రమంలోనే సెలెక్టర్లు వైస్ కెప్టెన్ నియామకానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిసింది.

-ఇగో వదిలేయ్ కోహ్లీ.. జూనియర్ల కెప్టెన్సీలో ఆడు: కపిల్ దేవ్ చురకలు
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదిలేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు కపిల్ దేవ్ తెలిపాడు. కోహ్లీ ఇప్పటికైనా తన ఇగోనే పక్కనపెట్టి జూనియర్ల కెప్టెన్సీలో ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. తాను కూడా తన కంటే జూనియర్లు అయిన శ్రీకాంత్, అజారుద్దీన్ వంటి ఆటగాళ్ల సారథ్యంలో ఆడినవాడినేనని.. అందుకే ఏమాత్రం ఫీలవ్వలేదని చెప్పుకొచ్చాడు. కోహ్లీ కూడా రోహిత్, కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఏమాత్రం ఫీలవ్వకుండా ఆడాలని సూచించాడు.