Begin typing your search above and press return to search.

జగన్ కోటరీలో తెలుగు ఫైర్ బ్రాండ్ ఐఏఎస్

By:  Tupaki Desk   |   17 July 2019 11:18 AM GMT
జగన్ కోటరీలో తెలుగు ఫైర్ బ్రాండ్ ఐఏఎస్
X
నిజాయితీగా ఉండటం అంటే మాట్లాడినంత సులువు కాదు. అందుకే చాలా అరుదుగా మాత్రమే నిజాయితీ అధికారుల పేర్లు వారు ఏ రాష్ట్రంలో మనకు వినపడుతుంటాయి. అది ఇంకా వార్తగా ఎందుకు అనిపిస్తోందంటే... అరుదైన విషయాలన్నీ వార్తలే కదా. ప్రస్తుతం హాసన్ కలెక్టర్ గా పనిచేస్తున్న రోహిణి సింధూరి గురించి మీకు తెలిసే ఉంటుందిగా. కర్ణాటకలో రాజకీయ నేతలకు ముచ్చెమటలు పట్టించి ... అనేక సార్లు బదిలీ అయిన ఈమె తెలుగు ఆడబిడ్డ. తెలంగాణలో పుట్టి నెల్లూరుకు చెందిన సుధీర్ రెడ్డిని వివాహమాడారు. వీరికి ఒక కొడుకు ఉన్నారు.

చదువంతా హైదరాబాదులో కొనసాగించిన ఈ తెలుగు వనిత కెమికల్ ఇంజినీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు. 2009లో ఐఏఎస్ కు ఎంపికయ్యారు. ఇప్పటికి కెరీర్ పదేళ్లే గానీ ట్రాన్స్ ఫర్లు అంతకుమించి. ఇక పనిచేసినందుకు బదిలీలు బహుమానంగా ఇస్తున్న నేతల మీద కోపం వచ్చి ఆమె కోర్టును ఆశ్రయించగా... ఆమె వాదన గెలిచింది. దీంతో హాసన్ నుంచి బదిలీ అయిన ఆమెను ముఖ్యమంత్రి కుమారస్వామి మారు మాటాడకుండా తిరిగి హాసన్ కలెక్టరుగా పునర్నియామకం చేశారు.

ఎక్కడెక్కడున్న పవర్ ఫుల్ అధికారులును ఏరి కోరి తెచ్చుకుంటున్న జగన్ ఈమెను ఆంధ్రా సర్వీసుకు పంపాలని కేంద్రానికి, కర్ణాటక ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కేంద్రం సంగతి పక్కన పెడితే ఆమెనా? వెంటనే పంపించేస్తాం అంటూ సంతోషంగా పంపిస్తున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి. మరి రోహిణి అంటే ప్రజలకు ఇష్టం గాని నిజాయితీ అంటే అందరు నేతలు ఇష్టపడరుగా. మొత్తానికి అతి త్వరలో ఆమె జగన్ టీంలో అమరావతి సచివాలయంలో కనిపించనున్నారు.