Begin typing your search above and press return to search.

ఉప్పొంగుతున్న న‌దులు.. మ‌రోమారు వ‌ర‌ద ముప్పు త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   10 Aug 2022 1:30 PM GMT
ఉప్పొంగుతున్న న‌దులు.. మ‌రోమారు వ‌ర‌ద ముప్పు త‌ప్ప‌దా?
X
ఎగువ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాల‌కుతోడు ఉప న‌దులు, కొండ వాగులు, వంక‌లు పొంగి ప్ర‌వ‌హిస్తుండ‌టంతో గోదావ‌రి, కృష్ణా, తుంగ‌భ‌ద్ర న‌దులు మ‌రోమారు భారీ ప్ర‌వాహాల‌తో పోటెత్తుతున్నాయి. ఇప్ప‌టికే శ్రీశైలం ప్రాజెక్టులో ప‌ది గేట్లు ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. తుంగ‌భ‌ద్ర వ‌ర‌ద ఉధృతికి చారిత్ర‌క హంపిలో ప‌లు క‌ట్ట‌డాలు నీట మునిగాయి. మ‌రోవైపు గోదావ‌రి మ‌రోమారు ఉధృత రూపం దాల్చ‌డంతో ధ‌వ‌ళేశ్వ‌రం వ‌ద్ద అధికారులు మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ చేశారు.

క‌ర్ణాట‌క‌లో ఎగువ భాగంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా-తుంగభద్ర నదుల్లో వరద ఉధృతి పెరిగింది. ఎగువ భాగం నుంచి వస్తున్న వరద కారణంగా తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు 1.40 లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

అదే సమయంలో నారాయణపూర్‌ జలాశయం నుంచి కూడా నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో కృష్ణా నదిలో 1.47 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో క‌ర్ణాట‌క‌లో రాయ‌చూరు, తెలంగాణ‌లో ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో రెండు నదుల తీరంలో ఉన్న గ్రామాల ప్రజలను అధికార‌ యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

క‌ర్ణాట‌క‌లో ఎగువ‌న వ‌ర్షాలు ప‌డుతుండ‌టం, కృష్ణా ఉప‌నది తుంగ‌భ‌ద్ర వ‌ర‌ద‌తో పోటెత్తుండ‌టంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3,64,683 క్యూసెక్కులుగా ఉంది. ఇక‌ ఔట్ ఫ్లో 3,39,948 క్యూసెక్కులుగా ఉంది.

శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.30 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీల కాగా ప్రస్తుతం 211.4759 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

మ‌రోవైపు న‌దీ ప‌రీవాహ‌క ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ఉధృతి కూడా ఎక్కువగానే ఉంది. దీంతో అధికారులు ధ‌వళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 10.27 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

గోదావరి ఉధృతి నేపథ్యంలో ఏపీ వివపత్తుల సంస్థ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. అత్యవసర సహయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు (1070, 18004250101, 08632377118) సంప్రదించాలని సూచించింది. అలాగే గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ ఎండీ డా.బి.ఆర్.అంబేద్కర్ సూచించారు.