Begin typing your search above and press return to search.

రేవంత్, కోమటిరెడ్డి కలిశారు.. కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్

By:  Tupaki Desk   |   27 Nov 2021 4:30 PM GMT
రేవంత్, కోమటిరెడ్డి కలిశారు.. కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్
X
తెలంగాణ కాంగ్రెస్ ను బతికి బట్టకట్టించడానికి సీనియర్లను కాదని.. పక్క పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పడంపై కాంగ్రెస్ సీనియర్లు భగ్గుమన్నారు. అసమ్మతి రాజేశారు. పీసీసీ చీఫ్ గా పోటీపడ్డ కోమటిరెడ్డి అయితే పార్టీకి దూరంగా జరిగి అధిష్టానంపై తిట్టిపోశారు. గాంధీ భవన్ గడప తొక్కనన్నారు.

అయితే పాత పగలన్నీ పక్కనపెట్టి తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు కలిసిపోయారు. వరి దీక్ష సందర్భంగా కాంగ్రెస్ నిరసనలో వీరిద్దరూ సరదాగా ఆహ్లాదంగా ముచ్చటించుకోవడంతో కాంగ్రెస్ లో అతిపెద్ద వివాదం సమసినట్టైంది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది.

రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించినప్పటి నుంచి మొన్నటి హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల వరకూ రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వ్యతిరేకంగానే వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి మధ్య విభేదాలు కాంగ్రెస్ కేడర్ లో కొంచెం అస్పష్టత తీసుకొచ్చాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత నిర్వహించిన పీఏసీ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ కాంగ్రెస్ నేతలందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇలా అసమ్మతి రాజేస్తే కాంగ్రెస్ కార్యకర్తల్లోకి ప్రతికూల సంకేతాలు వెళుతాయని గ్రహించిన సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చే పనిని భుజానకెత్తుకున్నారు

ఈ క్రమంలోనే కోమటిరెడ్డి బాధ్యతను సీనియర్ నేత వీ హనుమంతరావుపై పెట్టారు. ఆయన కోమటిరెడ్డిని శాంతపరిచి ఆందోళనలో పాల్గొనేలా చేసి వేదికపై రేవంత్ రెడ్డితో కలిపేశారు.

ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ‘కర్షకుల కోసం కాంగ్రెస్’ అంటూ నేడు కాంగ్రెస్ వరి దీక్షలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద వరి దీక్షలు చేపట్టింది. అయితే ఈ దీక్షల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొనడం.. రేవంత్ తో విభేదాలు మరిచి సరదాగా మాట్లాడడంతో కాంగ్రెస్ లో పెను తుఫాన్ చల్లారినట్టైంది. కొంత సేపు కార్యకర్తలందరూ ఆనందంలో మునిగిపోయారు.

కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి పక్కపక్కనే ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం వెల్లివిరిసింది. కాంగ్రెస్ లో ఐక్యతను ఇలా ఇద్దరూ చాటిచెప్పారు.