Begin typing your search above and press return to search.

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే: కేసీఆర్ పై రేవంత్ సంచలన నిజాలు

By:  Tupaki Desk   |   22 Oct 2021 9:34 AM GMT
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే: కేసీఆర్ పై రేవంత్ సంచలన నిజాలు
X
తెలంగాణలో కాంగ్రెస్ ఇక కనుమరుగవుతుందన్న స్థితిలో పార్టీకి కొత్త ఊపు వచ్చింది. అందుకు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అవడమే కారణం. ఎన్నో సమీక్షలు, సీనియర్ల అసంతృప్తుల మధ్య కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు కొన్ని సాంప్రదాయాలను పక్కనబెట్టి రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పారు. సుధీర్ఘ కాలంగా టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డికి ఒక దశలో పార్టీని అప్పగిస్తే మరింత దిగజారుతామని కొందర కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన తమకే పీసీసీ బాధ్యతలు ఇవ్వాలని కొందరు పట్టుబట్టారు. కానీ యూత్లో రేవంత్ రెడ్డికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.

పీసీసీ పగ్గాలు చేతబూనిన రేవంత్ రెడ్డి మరుసటి రోజు నుంనే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిరిజన దండోరా పేరుతో సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. గిరిజన బంధు కూడా ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పార్టీలో అసంతృప్తులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. అయితే కొమటి రెడ్డి లాంటి నాయకులు మాత్రం రేవంత్ రెడ్డిని పరోక్షంగా స్వాగతించినా ఆయన నిర్ణయాలను మాత్రం వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి తనకు రాష్ట్రంలో బద్ధ శత్రువు కేసీఆర్ అంటున్నారు. అంతేకాకుండా తనకు పీసీసీ పదవి రావడానికి ముఖ్య కారణం కేసీఆరే నని చెబుతున్నారు. ఎందుకంటే సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న నన్ను ప్రతీసారి ఏదో ఒక విషయంలో ఆరోపణలు చేస్తూ రెచ్చగొట్టాడు. దీంతో ఎలాగైనా నాకొక అండ కావాలని నిర్ణయించుకున్నానని, అందుకు కాంగ్రెస్ పీసీసీ పదవి ఉంటే చాలనుకున్నాను. సోనియాగాంధీ ఆశీస్సులతో పీసీసీ పోస్టు వచ్చిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియాకు ముడుపు ఇచ్చే రోజులు త్వరలో ఉన్నాయని అన్నారు. ఇదంతా రేవంత్ రెడ్డి ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో తెలిపారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఫుల్ వీడియోలో సంచలన విషయాలు బయటపెట్టే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ప్రోమోలో ఏమన్నాడంటే..?

‘నా జీవితంలో అతిపెద్ద గోల్.. లక్ష్యం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ ను ఓడించడమే.. ఇప్పుడు, ఈ క్షణం కేసీఆర్ ను ఓడించి వెంటనే అడవుల్లోకి పంపాలన్నదే నా ధ్యేయం. అయితే ఈ లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదిస్తా...తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా దోచుకుంటున్న కేసీఆర్ పతనం చేసిన రోజు నేను విజయం సాధించానని ఫీలవుతా. ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నా.’

‘బీజేపీ, కేసీఆర్ ఒక్కటే. ఈ రెండు పార్టీలు పైకీ వేరు వేరు కనిపించినా ఒక్క తాటిపైనే ఉంటాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, కేసీఆర్ ఈ ముగ్గురు ఎప్పటికీ కలిసే ఉంటారు. రాష్ట్ర బీజేపీ అసలు మాకు పోటీయే కాదని అనుకుంటున్నాం.....ఓటుకు నోటు కేసులో ఎన్ని ప్రగల్భాలు చేసినా నేను క్లీన్ గానే ఉంటా. ఇప్పటికే ఎన్నో రోజులుగా విచారణ జరుపుతున్నారు. ఎక్కడైనా అవినీతి పరుడని తేల్చారా..? లేదు.. రాజశేఖర్ రెడ్డి తరువాత మళ్లీ రేవంత్ రెడ్డి అని అంటున్నారు. అయితే ఆ మహనీయుడంత నాయకుడిని కాదు. కాకపోతే ఆయనలా కష్టపడి పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా కృషి చేస్తానని మాట ఇస్తున్నా..’అని రేవంత్ రెడ్డి సంచలన నిజాలను చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.