Begin typing your search above and press return to search.

ట్రాన్స్‌జెండర్లకి రిజర్వేషన్స్... ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   22 July 2021 6:55 AM GMT
ట్రాన్స్‌జెండర్లకి రిజర్వేషన్స్... ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
X
ట్రాన్స్ జెండ‌ర్స్ .. వీరి పై సమాజంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అయితే , ఎవరో కొందరు చేసే తప్పుడు పనుల వల్ల ట్రాన్స్ జెండ‌ర్స్ అయిన అందరూ అలాంటివారే అనుకోవడం తప్పు. ఇదిలా ఉంటే ట్రాన్స్ జెండ‌ర్స్ విషయంలో తాజాగా కీలక ముందడుగు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. వారి విషయంలో అసమానతలను రూపు మాపేందుకు మొట్టమొదటిసారిగా ఓ రాష్ట్రం కీలక ప్రకటన చేసింది. ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌లో ఒక శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ కర్ణాటక ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసింది.

ఈమేర‌కు క‌ర్ణాట‌క హైకోర్టుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక నివేదిక‌ను కూడా స‌మ‌ర్పించింది. దీనికోసం కర్ణాటక సివిల్‌ స‌ర్వీసెస్ రూల్- 1977కు స‌వ‌ర‌ణ‌లు చేసిన‌ట్టు ఆ నివేదిక‌లో పేర్కొంది. దీంతో దేశంలోనే ట్రాన్స్ జెండ‌ర్ల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక రికార్డ్ సృష్టించింది.

సంగ‌మా అనే స్వ‌చ్ఛంద సంస్థ ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు ఉద్యోగాల‌ను నిరాక‌రించ‌డాన్ని స‌వాలు చేస్తూ కర్ణాటక హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేసింది. స్టేట్ స్పెష‌ల్ రిజ‌ర్వ్ కానిస్టేబుల్ ఫోర్స్ అండ్ బ్యాండ్‌మెన్ పోస్టింగుల‌లో ట్రాన్స్‌ జెండ‌ర్ల‌కు అవ‌కాశం లేక‌పోవ‌డాన్ని ప్ర‌శ్నిస్తూ ఆ సంస్థ ధ‌ర్మాస‌నాన్ని ఆశ్ర‌యించింది. జ‌స్టిస్ ఏఎస్ ఓఖా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించింది.

విచార‌ణ‌ సంద‌ర్భంగా కర్ణాటక ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ విజ‌య‌కుమార్ పాటిల్ ట్రాన్స్‌ జెండ‌ర్ల ఒక‌శాతం రిజ‌ర్వేష‌న్‌ కు ప్ర‌భుత్వం ఆమోద‌ముద్ర వేసింద‌ని చెప్పారు. దీనికోసం ప్ర‌స్తుతం ఉన్న నిబంధ‌న‌ల‌కు స‌వ‌ర‌ణ‌లు చేసింద‌ని కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు.

జీవా అనే స్వ‌చ్ఛంద సంస్థ త‌ర‌పున పిటిష‌న్ వేసిన జ‌య‌నా కొఠారి త‌న వాద‌న‌లు వినిపిస్తూ, ప్ర‌భుత్వ స‌ర్వీసుల‌తోపాటు, బోర్డులు, కార్పొరేష‌న్ల‌లోనూ ఈ రిజ‌ర్వేష‌న్ వ‌ర్తించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు. అయితే దీనిపై ప్ర‌త్యేకంగా పిటిష‌న్ దాఖ‌లు చేస్తే ఆదేశాలు జారీ చేస్తామ‌ని కోర్టు తెలిపింది. అలాగే కేంద్ర‌ ప్ర‌భుత్వం కూడా ఈ విష‌య‌మై త‌న విధాన‌మేమిటో తెల‌పాల‌ని ప్రాసిక్యూట‌ర్‌ను కోర్టు కోరింది. ట్రాన్స్ జెండ‌ర్ల‌కు ఒక శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డాన్ని హైకోర్టు కూడా స్వాగ‌తించింది.

ఈ విషయంపై కర్ణాటక ప్ర‌భుత్వం జులై 6వ తేదీనే తుది నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. జ‌న‌ర‌ల్ స‌ర్వీసుల‌తోపాటు రిజ‌ర్వ్ కేట‌గిరీ ల‌లోనూ ట్రాన్స్ జెండ‌ర్ల‌కూ అవ‌కాశం క‌ల్పిస్తున్నట్లు అందులో వెల్లడించింది. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించేట‌ప్పుడు ద‌రఖాస్తు ఫారాల‌లో ఆడ‌, మ‌గ‌తో పాటు ఇత‌రులు అనే కాల‌మ్‌ ను కూడా జోడించాల‌ని స్ప‌ష్టం చేసింది.

ఇక ఎంపిక ప్ర‌క్రియ‌లో ట్రాన్స్‌ జెండ‌ర్ల విష‌య‌మై ఎటువంటి వివ‌క్ష చూప‌రాద‌ని కూడా ప్ర‌త్యేకించి చెప్పింది. ఒక‌వేళ ట్రాన్స్‌ జెండ‌ర్ అభ్య‌ర్థులు ఎవ‌రూ లేని ప‌క్షంలో ఆ కేట‌గిరిలోనే మ‌హిళ‌లు, లేదా పురుషుల‌కు ఆ ఉద్యోగాన్ని కేటాయించాల‌ని నోటిఫికేష‌న్‌ లో వెల్లడించారు.

విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే కేంద్రం కీలక ప్రకటన కూడా చేసింది. ఈ విషయంలో సుప్రీం కోర్టు 2014లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. దానిని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది.

ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర విద్యా శాఖ వివిధ మార్గాలను అధ్యయనం చేస్తోంది. ట్రాన్స్జెం డర్లను ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు) గా గుర్తించి ఆ కోటాలో రిజర్వేషన్ కల్పించడానికి ఎంత మేరకు అవకాశం ఉందో ప్రభుత్వం పరిశీలిస్తోందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ విషయాన్ని మొదటగా సామాజిక న్యాయం ,సాధికారత మంత్రిత్వశాఖకు తెలియపరిచింది.