Begin typing your search above and press return to search.

గ్రామ పంచాయ‌తీల‌కు వైసీపీ రంగు..హైకోర్టు అదిరిపోయే షాక్‌

By:  Tupaki Desk   |   28 Jan 2020 3:32 AM GMT
గ్రామ పంచాయ‌తీల‌కు వైసీపీ రంగు..హైకోర్టు అదిరిపోయే షాక్‌
X
గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు పడుతున్న ఉదంతంపై హైకోర్టు మ‌రోమారు క‌న్నెర్ర చేసింది. గ్రామ పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేయాలని మెమో ఇచ్చిన పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఇప్పటికే హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. గుంటూరు జిల్లాకు సంబంధించిన ఈ కేసులో కమిషనర్‌ ఇచ్చిన మెమోను అమలు చేశామని కలెక్టర్‌ హైకోర్టుకు తెలిపారు. దీంతో ఫిబ్రవరి 20లోపు అఫిడవిట్‌ సమర్పించాలని చీఫ్‌ జస్టిస్‌ ఆదేశించారు. ఇది ఇలా ఉండ‌గా, తాజాగా స్పందించిన హైకోర్టు గ్రామ‌పంచాయ‌తీల‌కు వేసిన రంగుల‌ను తొల‌గించాల‌ని ఆదేశించింది.

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ భవనాల‌కు రంగుల మార్పిడి ప్ర‌క్రియ మొద‌లైంది. ఆ రంగులు వైసీపీ పార్టీకి చెందిన జెండాలోని రంగులు కావ‌డంతో వివాదం రేగింది. దీనిపై ప‌లువురు గ‌తంలోనే హైకోర్టును ఆశ్ర‌యించ‌గా క‌మిష‌న‌ర్ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తాజాగా మ‌రోమారు ఇదే అంశం విచార‌ణ‌కు రావ‌డంతో న్యాయ‌స్థానం ఘాటుగా స్పందించింది. పంచాయ‌తీ కార్యాల‌యాలు ప్ర‌భుత్వం యొక్క ఆస్తుల‌ని పేర్కొంటూ... పార్టీ ప‌ర‌మైన స‌ద‌రు రంగుల‌ను తొల‌గించాల‌ని స్ప‌ష్టం చేసింది.

పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని పేర్కొంది. తదుపరి విచారణ ఫిబ్రవరి ఐదో తేదీకి వాయిదా వేసింది. కాగా, ఇప్ప‌టికే రంగుల మార్పిడికి భారీగా ఖ‌ర్చు చేసిన‌ట్లు స‌మాచారం. కోర్టు తీర్పు అమ‌లు చేయ‌డంతో...మ‌ళ్లీ రంగుల‌కు ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి.