Begin typing your search above and press return to search.

కరోనాతో 24 గంటల్లో 1,500మంది మృత్యువాత

By:  Tupaki Desk   |   4 April 2020 8:10 AM GMT
కరోనాతో 24 గంటల్లో 1,500మంది మృత్యువాత
X
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ విశ్వరూపం చూపిస్తోంది. ఆ దేశంలో ఇప్పటికే కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు దాదాపు మూడు లక్షలకు చేరువ కాగా.. మృతుల సంఖ్య దాదాపు 7,400కు చేరింది. ఆ దేశంలో రోజు మరణ మృదంగం మోగుతోంది. దీంతో వైరస్‌ తన ప్రతాపం తీవ్రంగా చూపుతోంది. పెద్ద సంఖ్యలో కరోనా బాధితులు మృతి చెందుతుండడంతో ఆమెరికాలో అంత్యక్రియలు చేసేందుకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ సమయంలోనే మరణాల సంఖ్య మత్రం తగ్గడం లేదు. తాజాగా ఒక్క 24 గంటల్లో 1,500మందికి పైగా కరోనాతో మృత్యువాత పడ్డారని అమెరికా ప్రకటించింది. దీంతో అమెరికాలో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడం ఆ దేశంలో పరిస్థితులు చేయి దాటి పోతున్నాయి.

గురు-శుక్రవారం వరకు 24 గంటల సమయంలో ప్రపంచ రికార్డు స్థాయి కరోనా మృతులు చోటుచేసుకున్నాయని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ ప్రకటించింది. దాదాపు 1,500 మంది కరోనా వైరస్‌ తో బాధపడుతూ మరణించారని వెల్లడించింది. ఇటలీ - స్పెయిన్‌ తర్వాత అమెరికాలోనే అత్యధికంగా కరోనా మృతులు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 వేల మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య 11 లక్షలు దాటింది. వీటిలో అమెరికాలో 2.77 లక్షల కేసులు నమోదయ్యాయి.

అయితే కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనల్డ్‌ ట్రంప్‌ నివారణ చర్యలు చేపట్టారు. కరోనా కట్టడికి భారతదేశంలో చేపట్టిన మాదిరి చర్యలు తీసుకున్నారు. అమెరికన్లందరూ నాలుగు వారాల పాటు ఇంటికే పరిమితమవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భౌతిక దూరానికి మించిన పరిష్కార మార్గం లేదని స్పష్టం చేశారు. మన రక్షణ కోసం స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా అదుపులోకి వస్తుందని, భౌతిక దూరం పాటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.