Begin typing your search above and press return to search.

ఖమ్మం, గుడివాడ.. రెండు చోట్లా పోటీ చేస్తా: కాంగ్రెస్‌ మహిళా ఫైర్‌ బ్రాండ్‌ సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   7 Feb 2023 10:38 AM GMT
ఖమ్మం, గుడివాడ.. రెండు చోట్లా పోటీ చేస్తా: కాంగ్రెస్‌ మహిళా ఫైర్‌ బ్రాండ్‌ సంచలన వ్యాఖ్యలు!
X
తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మరోసారి వార్తల్లోకి వచ్చారు. గతంలో అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర సందర్భంగా ఏపీకి వచ్చి ఆమె రైతులకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓడిపోవడం ఖాయమని ఆమె తేల్చిచెప్పారు.

ఈ క్రమంలో రేణుకా చౌదరి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డ సంగతి తెలిసిందే. ఖమ్మంలో కార్పొరేటర్‌గా గెలవలేని ఆమె కూడా తమ నాయకుడు జగన్‌ గురించి మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. ఏపీ రాజకీయాల్లో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని నాని ఎగతాళి చేశారు.

కొడాలి నాని వ్యాఖ్యలపై ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో రేణుకా చౌదరి మండిపడ్డారు. తాను కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు కొడాలి నాని లారీ క్లీనర్‌ అని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా కొడాలి నానిపై ఆమె మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి తాను పోటీ చేస్తున్నానని తెలిపారు. తద్వారా ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని చెప్పారు.

''నానీకి నా చరిత్ర తెలియదు. అతను నా గురించి మరింత తెలుసుకోవాలంటే గూగుల్‌లో సెర్చ్‌ చేయాలి'' అని రేణుక చెప్పడం విశేషం. అంతేకాకుండా నానిని 'బుజ్జి' అని సంబోధించిన రేణుక.. నాని అమాయకత్వాన్ని ఎగతాళి చేశారు. తన పేరును ఏపీ అసెంబ్లీలో ప్రస్తావించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

''పబ్లిసిటీ కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. కానీ నాని వల్ల నాకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. ఖమ్మంలో గెలవలేనని ఆయన సవాల్‌ విసిరారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయనపై కాంగ్రెస్‌ టిక్కెట్‌పై గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. అయితే నాని దయవల్ల తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచాను. కొడాలి నాని ఖమ్మం వీధుల్లో తిరుగుతుంటే నా సత్తా ఏమిటో తెలుస్తుంది'' అని రేణుక ధ్వజమెత్తారు.

ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు రేణుకా చౌదరి హాట్‌ కామెంట్స్‌ చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌ రావు ఠాక్రే ఆహ్వానం మేరకు ఆయనను రేణుకా చౌదరి కలిశారు. ఠాక్రేతోపాటు తాను కూడా హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ యాత్రలో పాల్గొంటానని తెలిపారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ కార్యక్రమానికి ఖమ్మం జిల్లాకు ఆహ్వానిస్తామని వెల్లడించారు. ఖమ్మంలో పెద్ద సభ ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌ లో చేరిన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ఎలా వస్తారో చూస్తామన్నారు.

కాగా తాను వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నట్లు రేణుకా చౌదరి తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తానని వివరించారు. ఏపీలోని గుడివాడ నుంచి కూడా పోటీ చేయాలంటూ కొందరు ఆహ్వానిస్తున్నారని హాట్‌ కామెంట్స్‌ చేశారు. అవసరమైతే రెండు చోట్లా పోటీ చేస్తానని రేణుకా చౌదరి స్పష్టం చేశారు.

కాగా 1986–1998 వరకు టీడీపీ తరఫున రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. దేవగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు 1997లో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1998లో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. 1999–2004, 2004 నుంచి 2009 వరకు రేణుకా చౌదరి ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్నారు. అంతేకాకుండా కేంద్రంలో మన్మోహన్‌ సింగ్‌ మంత్రివర్గంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. 2009, 2019 ఎన్నికల్లో ఆమె ఖమ్మం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2012లో తిరిగి మళ్లీ రాజ్యసభకు ఎంపికయ్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.