Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ తో ఎంత సేఫ్ అన్నది తేల్చిన తాజా రిపోర్టుల

By:  Tupaki Desk   |   19 July 2021 4:42 AM GMT
వ్యాక్సిన్ తో ఎంత సేఫ్ అన్నది తేల్చిన తాజా రిపోర్టుల
X
కరోనా మహమ్మారికి సంబంధించి బోలెడన్ని సర్వేలు.. నివేదికలు.. ఫీడ్ బ్యాక్ లు వస్తున్నాయి. వీటిల్లో చాలా వరకు స్థానికేతరమని చెప్పాలి. రిపోర్టులు.. సర్వేలకు లోకల్.. నాన్ లోకల్ అన్న మాట అవసరమా? అనుకోవచ్చు. కాకుంటే.. స్థానిక పరిస్థితుల మీద జరిగే సర్వేలు.. మరింత నమ్మకాన్ని కలిగిస్తాయన్నది మర్చిపోకూడదు. ఎందుకంటే.. స్థానిక పరిస్థితులకు.. ఎక్కడో సంబంధం లేని చోట ఉండే పరిస్థితులకు సంబంధం కాస్త తక్కువే అన్నది మర్చిపోకూడదు. తాజాగా సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ).. ఏఐజీ (ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ) సంయుక్తంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించాయి. కరోనాను నిలువరించటంలో కోవాగ్జిన్.. కోవీషీల్డ్ రెండూ ప్రభావాన్ని చూపిస్తున్నట్లుగా గుర్తించారు.

ఇందులో తీసుకున్న ప్రధాన అంశం.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా తీవ్రత ఎంత? అన్న దానిపైనే పరిశోధన సాగింది. మొత్తంగా 1161 మంది రోగుల్ని పరిశీలించి.. ఒక నివేదిక రూపొందించారు. ఈ 1161 మందిలో 495 మంది టీకాలు రెండు డోసులు తీసుకున్న వారు కాగా.. 666 మంది టీకాలు తీసుకోని వారు కాకపోవటం గమనార్హం. మరి.. ఈ సర్వే రిపోర్టు ఏం చెప్పిందన్నది చూస్తే..

- వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే.. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో పది రెట్లు ఎక్కువగా యాంటీబాడీస్ ఉన్నట్లుగా తేలింది.

- టీకా తీసుకున్న తర్వాత కొవిడ్ బారిన పడి సీరియస్ అయిన వారు 3.2 శాతం ఉండగా.. అసలు టీకా అన్నదే వేసుకోని వారిలో తీవ్రత 7.2 శాతం ఉన్నట్లుగా తేల్చారు

- వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో కరోనా సోకినప్పుడు ఐసీయూ చికిత్స అవసరమైన వారు 3.8శాతం కాగా.. వెంటిలేటర్ వరకు వెళ్లిన వారు 2.8శాతం. అదే వ్యాక్సిన్ వేయించుకోని వారిలో ఐసీయూ చికిత్స అవసరమైన వారు 4.7 శాతం.. వెంటిలేటర్ చికిత్స అవసరమైన వారు 5.9శాతం.

- వ్యాక్సిన్ వేసుకోని వారిలో కరోనా మరణాలు 3.5శాతం ఉంటే.. టీకా వేసుకున్న వారిలో మాత్రం 1.5 శాతానికే పరిమితమైనట్లు నివేదిక వెల్లడించింది.

- ఈ సర్వేలో గుర్తించిన మరో కీలక అంశం.. ఏప్రిల్.. మే నెలల్లో తీసుకున్న శాంపిల్స్ లో.. కరోనా బారిన పడిన వారిలో డెల్టా రకం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మొత్తం శాంపిల్స్ లో 201 నమూనాల జన్యు క్రమాల్ని గుర్తించగా.. అందులో టీకాలు తీసుకున్న వారికి సంబంధించి 97 నమూనాల్ని విశ్లేషించగా.. మొత్తం 97 మందిలో డెల్టా రకం వేరియంట్ బయటపడింది.

- టీకాలు తీసుకోని వారిలో 104 నమూనాల్ని విశ్లేషిస్తే.. 94 మందిలో డెల్టా రకం ఉన్నట్లుగా తేలింది. డెల్టా వైరస్ పై కొవాగ్జిన్.. కోవీషీల్డ్ రెండూ ప్రభావవంతంగా పని చేస్తున్నట్లుగా గుర్తించారు.