Begin typing your search above and press return to search.

మోడీ కేబినెట్‌ లోకి రామ్‌ మాధవ్‌ - మురళీధర్ రావు?

By:  Tupaki Desk   |   30 Sep 2020 6:05 PM GMT
మోడీ కేబినెట్‌ లోకి రామ్‌ మాధవ్‌ - మురళీధర్ రావు?
X
2024 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోన్న బీజేపీ పార్టీకి కొత్తరూపు కల్పించేందుకు నూతన కార్యవర్గాన్ని ఏర్పరిచిన సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎంపిక చేసిన నూతన కార్యవర్గంలో నలుగురు తెలుగువారికి స్థానం దక్కింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి - జాతీయ కార్యదర్శిగా ఏపీకి చెందిన సత్యకుమార్ - బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా మాజీ మంత్రి డీకే అరుణ - ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ లు నియమితులయ్యారు. అయితే, ఇప్పటివరకు ఏపీ - తెలంగాణలో బీజేపీ నేతలుగా క్రియాశీల పాత్ర పోషించి ఇన్నాళ్లు జాతీయ కార్యదర్శులుగా ఉన్నరాంమాధవ్ - మురళీధర్ రావులకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. ముందు నుంచి పార్టీ విధేయులుగా ఉన్న జాతీయ కార్యవర్గంలో స్థానం దక్కకపోవడంపై విమర్శలు వచ్చాయి.

అయితే, రామ్‌ మాధవ్‌ - మురళీధర్ ‌రావులకు ప్రధాని మోడీ కేబినెట్‌ లో చోటు కల్పించేందుకే జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించలేదన్న ప్రచారం జరుగుతోంది. వారిద్దరికీ కేబినెట్ మంత్రులుగా అవకాశం ఇచ్చేందుకు పక్కనపెట్టినట్టు పుకార్లు వస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై మంచి పట్టున్న రామ్‌ మాధవ్‌కు విదేశాంగ శాఖ - వ్యాపార వ్యవహారాల్లో అనుభవం ఉన్న మురళీధర్‌ రావుకు వాణిజ్య శాఖ దక్కనున్నాయన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ ఇద్దరు నేతలు చాలా కాలంగా పార్టీకి విధేయులుగా ఉన్నారని, ఇపుడు పార్టీ ఉచ్ఛదశంలో ఉన్నందున వారిని సముచితంగా గౌరవించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. వీరికి కేబినెట్ లో చోటు దక్కడం దాదాపుగా ఖాయమని కొందరు బీజేపీ నేతలు అనుకుంటున్నారు.