Begin typing your search above and press return to search.

రాహుల్ నామినేషన్ ఓకే.. బీజేపీ ప్లాన్ ఫెయిల్

By:  Tupaki Desk   |   22 April 2019 12:30 PM GMT
రాహుల్ నామినేషన్ ఓకే.. బీజేపీ ప్లాన్ ఫెయిల్
X
కాంగ్రెస్ అధ్యక్షుడికి జలక్ ఇద్దామని ట్రై చేసిన ప్రత్యర్థులకు ఈసీ చెక్ పెట్టింది. ఉత్తరప్రదేశ్ లోని అమేథి నుంచి ప్రతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న రాహుల్ గాంధీ ఈసారి కూడా నామినేషన్ వేశారు. కానీ బీజేపీ సానుభూతిపరుడిగా భావిస్తూ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన ధ్రువ్ లాల్ అనే అభ్యర్థి రాహుల్ నామినేషన్ లో అనేక వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దాంతో రాహుల్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి పరిశీలించేందుకు 22వ తేదీ నేటి వరకు వాయిదా వేశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడి పౌరసత్వం, అధ్యక్షుడి పేరు, విద్యార్హత మీద అమేథి నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన ధ్రువ్ లాల్ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈసీకి ఫిర్యాదు లో రాహుల్ నామినేషన్ ను తిరస్కరించాలని కోరారు.

అయితే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం..ఈసీ బీజేపీకి అనుకూలంగా మెదులుతుండడం.. రాహుల్ పై కేంద్రమంత్రి సృతీ ఈరానీ పోటీచేస్తుండడంతో రాహుల్ కు చిక్కులు తెచ్చిపెట్టాలని.. అతడి నామినేషన్ విషయంలో తిరస్కరణ చేయాలని యోచించారు. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుప్రీం కోర్టుకు వెళతానని స్పష్టం చేయడంతో ఈసీ అలెర్ట్ అయ్యింది. ఇదివరకే సుప్రీం ఈసీకి మొట్టికాయలు వేసింది. యూపీ సీఎం యోగి, మాయవతి విషయంలో నిర్లిప్తంగా వ్యవహరించినందుకు ఈసీకి తలంటింది. దీంతో రాహుల్ నామినేషన్ విషయంలోనూ తాము టార్గెట్ కాకూడదని భావించిన ఈసీ తాజాగా రాహుల్ నామినేషన్ ను స్వీకరిస్తున్నట్లు ఈ సాయంత్రం ప్రకటించింది.

కాంగ్రెస్ కంచుకోట అయిన అమేఠీలో మే 6న ఎన్నికలు జరుగనున్నాయి. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీచేసి విజయం సాధించారు. ఈసారి కూడా పోటీచేస్తున్నారు. అయితే ఆయనను దొంగ దెబ్బ తీయడానికి రాహుల్ నామినేషన్ పై ఆడిన డ్రామకు ఈసీ చెక్ పెట్టింది. రాహుల్ పోటీకి అవాంతరాలు తొలిగిపోయాయి.