Begin typing your search above and press return to search.

బెంగాల్ లో కలకలం..భార్య - కుమారుడు సహా టీచర్ దారుణ హత్య

By:  Tupaki Desk   |   10 Oct 2019 3:56 PM GMT
బెంగాల్ లో కలకలం..భార్య - కుమారుడు సహా టీచర్ దారుణ హత్య
X
పశ్చిమ బెంగాల్ లో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బంధు గోపాల్ పాల్ (35)తో పాటు నెలలు నిండిన గర్భిణీగా ఉన్న ఆయన సతీమణి - ఎనిమిదేళ్ల కుమారుడు వారి ఇంటిలోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ దారుణ ఘటనకు పాల్పడ్డ వారు ఎవరన్న విషయం ఇంకా తెలియలేదు గానీ.. ఈ ట్రిపుల్ మర్డర్ మాత్రం బెంగాల్ ను అల్లకల్లోలం చేసేలానే ఉంది. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ సర్కారుతో ఢీ అంటే డీ అన్నట్లుగా సాగుతున్న దీదీ... ఇప్పుడు ఈ దారుణ హత్యల నేపథ్యంలో విపత్కర పరిస్థితులు ఎదుర్కోక తప్పదన్న వాదన వినిపిస్తోంది.

ఒక్క బెంగాల్ నే కాకుండా యావత్తు దేశంలోనే పెను కలకలం రేపిన ఈ హత్యలు ఎలా జరిగాయి? ఈ హత్యలకు దారి తీసిన పరిస్థితులు ఏమిటన్న వివరాల్లోకి వెళితే... ఎనిమిదేళ్ల వయసున్న కుమారుడు - ప్రస్తుతం గర్భిణీగా ఉన్న తన సతీమణితో కలిసి ముర్షీదాబాద్ లో నివాసం ఉంటున్న బంధు గోపాల్ పాల్ దారుణ హత్యకు గురయ్యారు. తమ ఇంటిలోనే పాల్ తో పాటు ఆయన కుమారుడు - భార్య కూడా అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు.

మంగళవారం రాత్రి భార్యా కుమారుడి తో కలిసి నిద్రించిన పాల్... బుధవారం తెల్లారేసరికి విగత జీవిగా మారిపోయాడు. పాల్ తో పాటు ఆయన భార్య - కుమారుడిని కూడా దుండగులు పొట్టనబెట్టుకున్నారు. రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్న వీరిని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ముగ్గురి శవాలను పోలీసులు స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఒకే ఇంటిలో ముగ్గురి దారుణ హత్య - అది కూడా ఆ ముగ్గురూ ఓకే ఫ్యామిలీకి చెందిన వారు కావడం - ఇంటి యజమాని టీచర్ కావడం - ఆయన సతీమణి నెలలు నిండిన గర్భిణీ కావడం - ఆయన కుమారుడు ఏ పాపం తెలియని పిల్లాడు కావడంతో ఈ హత్యలు ముర్షీదాబాద్ తో పాటు పశ్చిమ బెంగాల్ ను - ఆ వెంటనే యావత్తు దేశాన్నే వణికించేశాయి. ఈ దారుణ హత్యలకు గల కారణాలేమీ తెలియకున్నా... ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గోపాల్ పాల్... గత కొంత కాలం నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరగతులకు హాజరవుతున్నారట. ఇలాంటి సమయంలోనే ఆయన భార్య - కుమారుడితో సహా హత్యకు గురి కావడం పెను కలకలంగా మారిపోయింది. పాల్ ఆరెస్సెస్ తరగతులకు హాజరవడాన్ని జీర్ణించుకోలేని వారే ఆయనను భార్య, కుమారుడితో సహా హత్య చేసి ఉంటారన్న కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ విశ్లేషణల్లో ఏ మేర నిజముందో తెలియదు గానీ... ఇప్పుడు ఈ విషయమే దేశవ్యాప్తంగా వైరల్ గా మారిపోయింది.

పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న దీదీ సర్కారును టార్గెట్ చేసే కార్యక్రమం వెంటనే మొదలైపోయింది. ఆరెస్సెస్ తరగతులకు హాజరు అవుతున్నారన్న కారణం తోనే పాల్ ను అత్యంత దారుణంగా హతమార్చి ఉంటారని ఆరెస్సెస్ కు చెందిన పలువురు ప్రముఖులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో నెలల గర్భిణీ - ఎనిమిదేళ్ల కుమారుడితో సహా ఓ ఉపాధ్యాయుడు దారుణంగా హత్యకు గురైన ఘటనపై దేశంలోని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలనూ కలచివేసింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈ ఘటనపై చాలా వేగంగా స్పందించారు. కారణాలు ఏమైనా ఇంతటి దారుణానికి పాల్పడ్డ వారికి కఠినాతికఠినమైన దండన పడాల్సిందేనని ఆమె ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించడంతో పాటుగా నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికే ఓ మోస్తరు రాజకీయ రంగు పులుముకున్న ఈ ఘటన తదనంతర దశలో ఎలాంటి విపరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.