Begin typing your search above and press return to search.

పంజాబ్ పంజా..చివర్లో రైజర్స్ కథ 'ముగిసింది'

By:  Tupaki Desk   |   25 Oct 2020 3:45 AM GMT
పంజాబ్ పంజా..చివర్లో  రైజర్స్ కథ ముగిసింది
X
ప్లే ఆఫ్స్ తేల్చే కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోల్తా కొట్టింది. చివరి దాకా విజయం దిశగా వచ్చి పటా పటా వికెట్లు పోగుట్టుకుని ఓటమి చెందింది ఈ ఫలితంతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ వెళ్లేదారులు మూసుకు పోయాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ లెవెన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 రన్స్ చేసింది. నికోలస్ పూరన్ (32 నాటౌట్) కేఎల్ రాహుల్(27) తప్ప మిగతా బ్యాట్స్ మెన్ విఫలం అయ్యారు. మాక్స్‌వెల్‌ (12; 13 బంతుల్లో), దీపక్‌ హుడా (0; 2 బంతుల్లో), క్రిస్‌ జోర్డాన్‌ (7; 12 బంతుల్లో), మురుగన్‌ అశ్విన్‌ (4; 4 బంతుల్లో) వరుసగా పెవిలియన్‌ చేరడంతో పంజాబ్‌ 126/7కు పరిమితమైంది.

హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ(2/29), జాసన్ హోల్డర్(2/27), రషీద్ ఖాన్(2/14) రెండేసి వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్ చేపట్టిన గెలుపు అంచుల దాకా వచ్చి చతికిల పడింది. 19.5 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటై అనూహ్య ఓటమి మూటగట్టుకుంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(35), బెయిర్ స్టో(19) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ధాటిగా ఆడుతున్న వార్నర్ బిష్ణోయ్‌ బౌలింగ్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.

18వ ఓవర్ వరకు గెలుపు దిశగా దూసుకెళ్లిన హైదరాబాద్.. ఒక్కసారిగా తడబడింది. చివరి రెండు ఓవర్లలోనే ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అబ్దుల్ సమద్(7), మనీశ్ పాండే (15) ఎక్కువ సేపు కుదురుకోలేక పోయారు. విజయ్ శంకర్(26) ఆచితూచి ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపించే ప్రయత్నం చేసినా చివరికి ఔట్ అయ్యాడు.

మ్యాచ్ కీలక మలుపు ఆ క్యాచే

పాండే ఉన్నంత వరకూ హైదరాబాద్ దే విజయం ఖాయం అనిపించింది. అతడి క్యాచ్ ఔట్ తో మ్యాచ్ పంజాబ్ వైపు మొగ్గింది. క్రిస్ జోర్డాన్ వేసిన 17వ ఓవర్ ఫస్ట్ బాల్‌ను మనీష్ పాండే భారీ షాట్ ఆడగా సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ సుజీత్ కళ్ళు చెదిరే క్యాచ్ పట్టి మ్యాచ్ మలుపు తిప్పాడు. అందరూ దానిని సిక్స్ అనుకోగా సుజీత్ అద్భుతంగా ఎగిరి బాల్ అందుకున్నాడు.

18 బంతుల్లో 20గా మారింది. కానీ విజయ్ శంకర్ (26) కూడా కీపర్ క్యాచ్‌గా ఔటవ్వడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది.

చివరి 2 ఓవర్లలో క్యూ కట్టేసారు

చివరి 12 బంతుల్లో 17 రన్స్ కొడితే హైదరాబాద్ దే విజయం. ఆ సమయంలో జాసన్ హోల్డర్(5), రషీద్ ఖాన్(0) వరుస బంతుల్లో ఔటయ్యారు.చివరి ఓవర్‌లో 14 రన్స్ అవసరం కాగా హైదరాబాద్ రెండు పరుగులే చేసి మూడు వికెట్లు కోల్పోవడంతో ఓటమి ఖాయం అయ్యింది. వరుసగా నాలుగు విజయాలతో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి.