Begin typing your search above and press return to search.

పబ్జీ గేమ్ 19లక్షలు మింగేసింది.. విచారణలో వెల్లడైన షాకింగ్ అంశాలు

By:  Tupaki Desk   |   21 Sep 2021 3:30 PM GMT
పబ్జీ గేమ్ 19లక్షలు మింగేసింది.. విచారణలో వెల్లడైన షాకింగ్ అంశాలు
X
ఓ పిల్లాడు చేసిన పని వల్ల అతని తల్లిదండ్రులు రూ. 19 లక్షల నష్టపోయారు. 7వ తరగతి చదువుతున్న పిల్లోడు ఆన్‌ లైన్ గేమ్స్‌ కి అలవాటు పడ్డాడు. అలా గేమ్ ఆడటం కోసం వర్చువల్ గన్స్, కార్స్ కొనుగోలు చేశాడు. దీనికోసం ఆ బాలుడు తన తల్లిదండ్రుల అకౌంట్లను వినియోగించి భారీ మొత్తంలో డబ్బును ఖర్చు చేశాడు. అయితే దీని వెనుక 20 ఏళ్ల కుర్రాడి పాత్ర ఉంది. అస్సాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్కూల్ విద్యార్థులందరికీ ఆన్‌లైన్ క్లాస్‌ లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అస్సాంకు చెందిన ఓ దంపతులు 7వ తరగతి చదువుతున్న తమ కుమారుడికి తమ సెల్‌ ఫోన్‌ ను ఇచ్చారు.

అయితే, ఆ బాలుడు ఆ స్మార్ట్ ఫోన్‌ ను ఆన్‌ లైన్ క్లాస్‌ ల కోసం కాకుండా.. పబ్‌ జి, బీజీఎంఐ వంటి ఆన్‌ లైన్ గేమ్స్ ఆడటం మొదలు పెట్టాడు. అలా ఆన్‌ లైన్ గేమ్స్‌ కి అలవాడు పడ్డాడు. అయితే ఈ గేమ్‌ లో భాగంగా తన స్నేహితుడు నిపురాజ్ గొగోయ్(20) సహా మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక గ్రూప్‌లా ఏర్పాటు అయ్యాడు. వీరందరూ కలిసి గేమ్స్ ఆడటం ప్రారంభించారు. అయితే, గొగోయ్ కన్నింగ్ ప్లాన్ వేశాడు. బాలుడిని నమ్మించి.. అతని తల్లి ఫోన్ నుంచి విలువైన సమాచారాన్ని సేకరించాడు. యూపీఐ ఐడీల వివరాలను తీసుకున్నాడు. ప్రారంభంలో బాలుడితో నమ్మశక్యంగా ఉంటూ వచ్చిన గొగోయ్.. పబ్‌ జి గేమ్‌ లో వర్చువల్ గన్‌ లు, కార్లు వంటివి కొనుగోలు చేయడానికి సహాయం చేశాడు.

వీటి కొనుగోలుకు బాలుడి తల్లి యూపీఐ అకౌంట్లను వినియోగించాడు. ఆ తరువాత గొగోయ్ తన యాక్షన్ ప్లాన్‌ ను అమలు చేయడం ప్రారంభించాడు. బాలుడి వద్ద ఉన్న అతని తల్లి సెల్‌ ఫోన్ సాయంతో.. ఐఫోన్‌ సహా మరో రెండు హై-ఎండ్ స్మార్ట్‌ ఫోన్లను కొనుగోలు చేశాడు. అయితే, గొగోయ్ వద్ద రెండు ఖరీదైన స్మార్ట్ ఫోన్లు ఉండటాన్ని చూసి మైనర్ బాలుడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే తమ ఖాతా ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌ కు వెళ్లి అకౌంట్ వివరాలను ఆరా తీశారు. అకౌంట్ నుంచి రూ. 19 లక్షలు మాయం అయినట్లు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఈ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఆన్‌లైన్ గేమ్ పేరుతో నమ్మించి మైనర్ బాలుడి సాయంతో అతని తల్లిదండ్రుల అకౌంట్ల నుంచి గొగోమ్ డబ్బులు కాజేసినట్లు గుర్తించారు. గొగోయ్ ప్రతీ రోజూ యూపీఐ ద్వారా డబ్బులు ట్రాన్ఫర్ చేస్తుండేవాడు. లావాదేవీలకు సంబంధించిన ఓటీపీ తీసుకుని, ఆ తరువాత డిలీట్ చేసేవాడు. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన మేసేజ్‌లు, ఇతర వివరాలు బాలుడి తల్లిదండ్రులకు ఏమాత్రం తెలియకుండా జాగ్రత్తపడ్డాడు అని పోలీసులు తెలిపారు. గొగోయ్ ఈ బాలుడికే కాదు మరో ఇద్దరు మైనర్ బాలుళ్లకు కూడా గేమింగ్ విషయంలో సహాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, వ్యవహారంలో గొగోయ్ సహా మరో ముగ్గురు బాలురను పోలీసులు అరెస్ట్ చేశారు. గొగోయ్‌ ని స్థానిక కోర్టులో హాజరుపరుచగా.. అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. అయితే వీరంతా మైనర్లు కావడంతో జువైనల్ కస్టడీకి పంపించారు. కాగా, గొగోయ్‌ను తమ కస్టడీలోకి కోరుతామని పోలీసులు తెలిపారు. డబ్బు మొత్తం ఎక్కడికి బదిలీ చేశాడో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.