Begin typing your search above and press return to search.

తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి... ఇద్దరు అరెస్ట్, వారి నేర చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు !

By:  Tupaki Desk   |   22 Jun 2021 10:30 AM GMT
తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి... ఇద్దరు అరెస్ట్, వారి నేర చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు !
X
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద ఈ నెల 19వ తేదీ రాత్రి నర్సింగ్ విద్యార్థిని పై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఎట్టకేలకి పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని సీతానగరానికి చెందిన వారిగా గుర్తించారు. వీరిద్దరిని బాధితురాలు గుర్తుపట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు. వీరు గతంలోనూ అనేక జంటలపై ఇలాగే క్రూరంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్‌ లో ఉన్న మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల్లో ఒకరికి గతంలో ఓ హత్య కేసుతో సంబంధమున్నట్లు సమాచారం. వీళ్లిద్దరూ కృష్ణానది ఇసుక తిన్నెలు, పుష్కరఘాట్లలో సంచరిస్తూ ఒంటరిగా ఉన్నవారిపై దాడులు చేసి సొమ్ములు దోచుకోవడం, ఆ సొమ్ముతో గంజాయి సేవించి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే .. విజయవాడకు చెందిన బాధిత యువతి ఓ ఆస్పత్రిలో నర్సుగా జాబ్ చేస్తుంది. ఆమెకు ఇటీవలే ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. శనివారం రాత్రి విధులు ముగించుకొని అతడితో కలిసి సీతానగరం పుష్కరఘాట్ కు వెళ్లింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది. వీళ్లిద్దరినీ గమనించిన ఇద్దరు యువకులు, వారిపై వెనుక నుంచి దాడి చేశారు. యువకుడి చేతులు కాళ్లు కట్టేసి, యువతిపై అత్యాతారం చేశారు. యువకుడు ఎదురుతిరగకుండా బ్లేడుతో బెదిరించారు. అనంతరం చెవి రింగులు, డబ్బులు, సెల్ ఫోన్ తీసుకొని ఓ నాటుపడవలో అక్కడి నుంచి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధితులు స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. నిందితులను త్వరలోనే పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని గుంటూరు అర్బన్ ఎస్పీ తెలిపారు. మరోవైపు ఘటనపై సీఎం జగన్ కూడా స్పందించారు. ఘటనపై అధికారులను ఆరాతీసిన ఆయన, హోంమంత్రి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితను జీజీహెచ్ కు పంపారు. ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించిన మంత్రులు, ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఘటనను సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారని నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారని తెలిపారు. బాధితురాలికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు.