Begin typing your search above and press return to search.

కామాంధుల ఎన్‌ కౌంటర్‌ .. దిశ త‌ల్లి దండ్రుల స్పందన ఇదే ?

By:  Tupaki Desk   |   6 Dec 2019 4:48 AM GMT
కామాంధుల ఎన్‌ కౌంటర్‌ .. దిశ త‌ల్లి దండ్రుల స్పందన ఇదే ?
X
హైదరాబాద్ నగర్ శివారు ప్రాంతంలో వెటర్నరీ డాక్టర్ దిశ ని నలుగురు మానవ మృగాళ్లు అత్యంత కిరాతకంగా అఘాయిత్యం చేసి ..హత్య చేసి ,సజీవదహనం చేసిన విషయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా దిశ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌ నగర్‌ సమీపం లోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారి పోవడానికి ప్రయత్నం చేయడం తో పోలీసులు ఆత్మ రక్షణ కోసం ఆ నలుగురు నిందితులను కాల్చి చంపారు.

కేసు విచారణ లో భాగంగా నిందుతులని తమ కస్టడీలోకి తీసుకోని , ఆ దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు నిందితులను తీసుకు వెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా... వారు పారిపోయేందుకు ప్రయత్నించడం తో పాటు, పోలీసుల పైకి దాడికి యత్నించారు. దీంతో వారి పై పోలీసులు కాల్పులు జరపడం తో ప్రధాన నిందితుడు ఆరిఫ్, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. ముందుగా ఆరిఫ్ పోలీసుల పైకి దాడికి ప్రయత్నించగా ..ఆ తరువాత మిగిలిన ముగ్గురు కూడా దాడికి పాల్పడట్టు సమాచారం.

ఇక దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన సంఘటనా స్థలానికి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చేరుకొని , ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. కొద్ది సేపట్లోనే ఎన్‌కౌంటర్‌ పై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. షాద్‌నగర్ పట్టణ శివారులోని చటాన్‌పల్లి వద్ద నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన ప్రదేశానికి జనాలు తండోపతండాలుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 44వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. దిశ‌ని కాల్చిన చోటే నిందితులని ఎన్‌కౌంట‌ర్ చేయ‌డంతో దిశ త‌ల్లిదండ్రులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందు మేము ఫిర్యాదు చేసినప్పుడు పట్టించుకోని పోలీసులు.. ఇప్పుడు కరెక్ట్ పని చేశారని అన్నారు. ఈ దెబ్బ తో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారికి వణుకు పుట్టాలని దిశ తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు.