Begin typing your search above and press return to search.

దిశ నిందితుల డెడ్ బాడీలకు గాంధీలో ఎంబామింగ్?

By:  Tupaki Desk   |   15 Dec 2019 4:20 AM GMT
దిశ నిందితుల డెడ్ బాడీలకు గాంధీలో ఎంబామింగ్?
X
దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ లో బలి కావటం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నాలుగు మృతదేహాలను గాంధీ ఆసుపత్రిలోని మార్చురీలో ప్రత్యేక ఫ్రీజర్ బాక్సుల్లో ఉంచారు. అయితే.. మృతదేహాలు 24 గంటల తర్వాత నుంచి కుళ్లిపోవటం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో అవి చెడిపోకుండా ఉండేందుకు నలుగురు డెడ్ బాడీలకు ఎంబామింగ్ ను చేపట్టారు.

రసాయనపూతతో మృతదేహాలు కుళ్లిపోకుండా ఉంటాయి. మృతదేహాలను భద్రపరిచేందుకు పూర్వకాలం నుంచి ఇదే విధానాన్ని అనుసరిస్తుంటారు. ఈ ఎంబామింగ్ ప్రక్రియలో రక్తనాళాల ద్వారా సుమారు రెండు గ్యాలన్ల ఫార్మల్ డీహైడ్ అనే ద్రావకాన్ని ఒక డెడ్ బాడీలో ఎక్కిస్తారు. రక్తనాళాల్లోకి ద్రావకం పంపింగ్ చేసేందుకు ప్రత్యేక వైద్య యంత్రాన్ని ఉపయోగిస్తారు.

ఒకసారి ఎంబామింగ్ చేస్తే రెండువారాల పాటు పాడైపోకుండా తాజాగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ ఎంబామింగ్ చేయకుండా ఫ్రీజర్ బాక్సుల్లో పెడితే ఆ చల్లదనానికి మృతదేహాలు గడ్డ కట్టిపోతాయి. అవి తాజాగా ఉండవు. ఈ నేపథ్యంలో మృతదేహాలు తాజాగా ఉండేందుకు వీలుగా ఈ రసాయన పద్దతిని చేపట్టారు. ఒకవేళ కోర్టు కానీ మరోసారి పోస్ట్ మార్టం చేయాలని ఆదేశిస్తే.. అందుకు వీలుగా ఈ చర్య ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ఇక..దిశ నిందితుల మృతదేహాలను ఉంచిన గాంధీ మార్చురీ వద్ద ప్రత్యేకంగా భద్రతా చర్యల్ని చేపట్టారు. ముగ్గురు సీఐలు.. ఆరుగురు ఎస్ఐలు.. సుమారు నలభై మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేయటం గమనార్హం. దిశ కేసుకున్న ప్రాధాన్యతతో పాటు.. నిందితుల మృతదేహాల భద్రత విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉండటంతో ఇంత భారీగా భద్రతను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.