Begin typing your search above and press return to search.

బెంగుళూరులో లవ్.. పాకిస్తాన్‌ లో జైలు!

By:  Tupaki Desk   |   19 Nov 2019 2:42 PM GMT
బెంగుళూరులో లవ్.. పాకిస్తాన్‌ లో జైలు!
X
సరిహద్దులు దాటి పాకిస్తాన్ లో ప్రవేశించి అక్కడి సైన్యానికి చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ గురించి అనేక కథనాలు వినిపిస్తున్నాయి. అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించిన ప్రశాంత్‌ కు ఉగ్ర సంబంధాలున్నాయేమోనని పాకిస్తాన్ అనుమానిస్తుండగా ఆయన తండ్రి మాత్రం తన కుమారుడు మంచివాడని.. అలాంటి సంబంధాలేమీ ఉండే చాన్సే లేదని చెబుతూ ప్రేమ విఫలమై తీవ్రమైన డిప్రెషన్ లో ఉండి అలా చేశాడని అంటున్నారు.

సాఫ్ట్‌ వేర్ ఉద్యోగం చేసే ప్రశాంత్ రెండు సంవత్సరాల క్రితం మరో సాఫ్ట్‌ వేర్ యువతితో ప్రేమాయాణంలో పడ్డాడని - దీంతో డిప్రెషన్‌ లోకి వెళ్లిపోయాడని ప్రశాంత్ తండ్రి బాబూరావు తెలిపారు. డిప్రెషన్ వల్లే రాజస్థాన్ నుంచి పొరపాటున పాకిస్తాన్‌ లోకి అడుగు పెట్టి ఉంటాడని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రశాంత్ మాదాపూర్‌ లోని ఓ సాఫ్ట్‌ వేర్ కంపనీలో ఉద్యోగం చేసేవాడని - అనంతరం బెంగళూర్‌కు వెళ్లాడని చెప్పారు. అక్కడే తన కుమారుడి ప్రేమ చిగురించినట్టు తండ్రి బాబూరావు చెప్పారు. అయితే రెండు సంవత్సరాల నుండి ప్రశాంత్ అచూకీ లభించలేదని - దీంతో ఏప్రిల్ 2017లోనే మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.

విశాఖకు చెందిన ప్రశాంత్ కుటుంబం గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ కూకట్‌ పల్లిలోని భగత్‌ సింగ్‌ నగర్‌ లో ఉంటోంది. పాకిస్తాన్‌ లో అక్రమంగా ప్రవేశించాడనే కారణంపై ప్రశాంత్‌ తో పాటు మధ్యప్రదేశ్‌ కు చెందిన హరీలాల్ అనే మరోవ్యక్తిని ఈ నెల 14న పాకిస్తాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా రెండేళ్ల కిందట మిస్సింగ్ కేసు నమోదైనా ఇంతవరకు పెద్దగా పట్టించుకోని హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు ప్రశాంత్ ఇష్యూ అంతర్జాతీయ వ్యవహారంగా మారడంతో ఒక్కసారిగా విచారణ మొదలుపెట్టారు. ఇక ప్రశాంత్‌ తో పట్టుబడ్డ హరీలాల్‌ తో ఆయనకున్న పరిచయమేంటన్నదీ దర్యాప్తు చేస్తున్నారు.