Begin typing your search above and press return to search.

బాబుకు బిగ్ షాక్..జగన్ తో పోతుల దంపతుల భేటీ

By:  Tupaki Desk   |   23 Jan 2020 2:31 PM GMT
బాబుకు బిగ్ షాక్..జగన్ తో పోతుల దంపతుల భేటీ
X
ఇప్పటికే దెబ్బ మీద దెబ్బ తిని లేవలేకపోతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పోతుల సునీత... తన భర్త పోతుల సురేశ్ తో కలిసి గురువారం జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ కు శాలువా కప్పి ఆయనతో కలిసి ఆ దంపతులు ఫొటోలకు ఫోజులిచ్చారు. జగన్ తో పోతుల దంపతుల భేటీ నిజంగానే టీడీపీలో పెను కలకలమే రేపిందని చెప్పాలి. పోతులకు టీడీపీ ఓ రేంజిలో ప్రాధాన్యమిచ్చిన సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన పోతులకు చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన.. అక్కడ పార్టీలో వర్గ పోరు కూడా సాగిందన్న వార్తలు వినిపించాయి.

ఆ తర్వాత చీరాల ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. సునీతకు ఎలాగూ ఎమ్మెల్సీ ఇచ్చాం కదా అన్న భావనతో పార్టీ సీనియర్ నేతగా ఉన్న కరణం బలరాంను చీరాల బరిలో నిలిపిన చంద్రబాబు... పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఎమ్మెల్సీగా పదవి దక్కించుకున్న సునీత కుటుంబం మొన్నటి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేసేందుకే పరిమితమై పార్టీ టికెట్లను ఆశించలేదు. అయితే మంగళవారం నాటి శాసనమండలి సమావేశాల్లో ఉన్నట్టుండి తన వైఖరి మార్చుకున్న పోతుల సునీత... వైసీపీకి అనుకూలంగా మారిపోయారు.

రాష్ట్రానికి మూడే రాజధానులకు అనుకూలంగా వ్యవహరించిన పోతుల టీడీపీ విప్ ను కూడా ధిక్కరించారు. టీడీపీకి వ్యతిరేకంగా సాగేందుకే నిర్ణయించుకున్న పోతుల సునీత... శాసనమండలి సమావేశాలకు కూడా గైర్హాజరయ్యారు. దీంతో పోతుల సునీత ఫ్యామిలీ ఇక వైసీపీలో చేరిపోయినట్టేనన్న వాదనలు వినిపించాయి. ఈ వాదనలు నిజమేనన్నట్లుగా తన భర్త పోతుల సురేశ్ తో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన సునీత... సీఎం జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబందించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇప్పటికిప్పుడు పోెతుల సునీత వైసీపీలో చేరకున్నా... టీడీపీ మాత్రం దూరంగానే ఉండనున్నట్లుగా, త్వరలోనే ఆమె వైసీపీలో చేరడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.