Begin typing your search above and press return to search.

లేటెస్ట్ అప్డేట్: భారత్ లో లక్షన్నర దాటిన కేసులు.. అమెరికాలో లక్ష దాటిన మృతులు !

By:  Tupaki Desk   |   27 May 2020 4:45 AM GMT
లేటెస్ట్ అప్డేట్: భారత్ లో లక్షన్నర దాటిన కేసులు.. అమెరికాలో లక్ష దాటిన మృతులు !
X
ఇండియా లో వైరస్ రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. రోజు రోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,387 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో, దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్షన్నర దాటింది. 170 మంది మృతిచెందారు. ప్రస్తుతం కేసుల సంఖ్య 1,51,767గా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 4,337కు చేరుకుంది. అటు.. 64,426 మంది కరోనా రోగులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీల్లో కరోనా వ్యాప్తి దారుణంగా ఉంది. ఒక్క మహారాష్ట్రలోనే 50 వేల కేసులు నమోదయ్యాయి.

రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయం. లాక్‌ డౌన్‌ సడలింపులతో అంతా రోడ్లపైకి వచ్చేస్తుండగా వైరస్ కొత్త కేసులు టెన్షన్ పెడుతున్నాయి. కాగా,తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1991కి చేరింది. కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 57కు పెరిగింది. ఇక ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2719కు చేరుకుంది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 759 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 57కు చేరుకుంది.

ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్న అగ్రరాజ్యం అమెరికా లో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా వైరస్ దెబ్బకు చిగురుటాకులా వణుకుతున్న అమెరికాలో మహమ్మారి కాస్త శాంతించిన ఛాయలు కనిపిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తి పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాకపోయినా గత వారంతో పోలిస్తే కొత్త కేసులు, మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. ఇప్పటివరకు అమెరికాలో 17.25 లక్షల మందికిపైగా వైరస్‌ బారిన పడ్డారు. న్యూయార్క్‌ రాష్ట్రంలో అత్యధికంగా 3 లక్షల 70 వేల మందికిపైగా వైరస్‌ బారినపడ్డారు. ఆ ఒక్క రాష్ట్రంలోనే దాదాపు 30 వేల మందికిపైగా జనం మృత్యువాతపడ్డారు అలాగే అమెరికా వ్యాప్తంగా వైరస్ మృతుల సంఖ్య లక్ష దాటింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 56,84,208 మంది ఇప్పటి వరకూ వైరస్ బారినపడ్డారు. వీరిలో 352,210 మంది ప్రాణాలు కోల్పోయారు.