Begin typing your search above and press return to search.

సర్పంచ్ టు ఎమ్మెల్యే.. అక్కడ రాజకీయమే డిఫరెంట్

By:  Tupaki Desk   |   14 July 2020 5:30 PM GMT
సర్పంచ్ టు ఎమ్మెల్యే.. అక్కడ రాజకీయమే డిఫరెంట్
X
నాటి నుంచి నేటి వరకు అత్యధిక వయోజనులున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఫ్యామిలీ పాలిటిక్స్ ఎక్కువ. మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీలే ఇక్కడ గెలుస్తూ ఆధిపత్యం చెలాయిస్తుంటాయి. ఒక కుటుంబం నుంచి కనీసం ముగ్గురు లేదా నలుగురు వివిధ రాజకీయ పదవుల్లో ఉంటారు. దీంతో ఈ జిల్లాలో సామాన్యులు పోటీచేయడం.. గెలవడం అన్నది అందని ద్రాక్షగా మారిపోయింది.

మాజీమంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి నుంచి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య కుటుంబాలు పదవులను జిల్లాలో పంచుకుంటున్నాయి. వీరి కుటుంబాల్లో ఇద్దరు నుంచి నలుగురు చొప్పున ప్రజాప్రతినిధులు ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ రాజకీయ కుటుంబాల పెత్తనం అటు రంగారెడ్డి.. ఇటు వికారాబాద్ జిల్లాలోనూ ఉండడం అసలైన అర్హులకు పదవులు రాకపోవడంపై గుర్రుగా ఉన్నారు.

రాజకీయాల్లో దశాబ్ధాలుగా కొనసాగుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కుటుంబంలో ఆయన భార్య వికారాబాద్ జడ్పీ చైర్మన్ కాగా ఆయన తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే..ఇక మహేందర్ రెడ్డి సోదరుడి కుమారుడు అవినాష్ రెడ్డి షాబాద్ జడ్పీటీసీగా ఉన్నాడు. మొత్తం ఆయన కుటుంబంలో నలుగురు ప్రజాప్రతినిధులుండడం విశేషం.

ఇక చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కుటుంబంలో ముగ్గురు పదవుల్లో ఉన్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఇంట్లోంచి ఇద్దరు ప్రజాప్రతినిధులు వచ్చారు. తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇంటి నుంచి ఆయన తల్లి వికారాబాద్ జడ్పీటీసీగా ఉన్నారు.

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇంట్లో ఇద్దరికి పదవులున్నాయి. మాజీ ఎమ్మెల్యే తీగల కోడలు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్. ఇలా రంగారెడ్డి జిల్లాలో ఫ్యామిలీ పాలిటిక్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక్కడ సామాన్యులకు పదవులు రావాలంటేనే గగనంగా మారింది. వీరి తీరుపై ఆశావహులంతా అవకాశాల్లేక మండిపడుతున్నారు.