Begin typing your search above and press return to search.

ఆర్ధిక సదస్సులో రాజకీయ ప్రసంగమా?

By:  Tupaki Desk   |   24 May 2022 6:30 AM GMT
ఆర్ధిక సదస్సులో రాజకీయ ప్రసంగమా?
X
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో మొట్టమొదటిసారిగా విచిత్రమైన సంఘటన చోటు చేసుకున్నది. మామూలుగా ప్రపంచ ఆర్ధిక సదస్సు అంటేనే వ్యాపారాలు, పెట్టుబడులు, వ్యాపార ఒప్పందాలు, పెట్టుబడులు పెట్టడానికి అనువైన వాతావరణంపై చర్చలు, రాష్ట్రాలకు ఆహ్వానాల పైనే ప్రధానంగా చర్చలు జరుగుతాయి. ఎందుకంటే దేశాలు, పరిశ్రమల మధ్య ఇలాంటి వేదికను ఏర్పాటు చేయటమే ప్రపంచ ఆర్ధిక సదస్సు ముఖ్య ఉద్దేశ్యం.

దావోస్ లో ఇలాంటి వేదిక ఏర్పాటయిన దగ్గర నుండి ఇన్ని సంవత్సరాల్లో జరుగుతున్న చర్చలు, ఒప్పందాలన్నీ పరిశ్రమలు, పెట్టుబడుల కేంద్రంగానే జరుగుతున్నాయి. అయితే మొదటిసారి ఈ వేదికపై రాజకీయమైన ప్రసంగం జరిగింది. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికి మూడు నెలలైనా ఇంకా యుద్ధం కంటిన్యు అవుతునే ఉన్నది.

ఈ నేపధ్యంలోనే ప్రపంచదేశాలను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రపంచదేశాలన్నీ రష్యాతో అన్ని రకాలైన లావాదేవీలను వెంటనే నిలిపేయాలని కోరారు.

రష్యా బ్యాంకులను ప్రపంచ దేశాలు తమ దేశాల్లో తక్షణమే నిషేధించాలని పిలుపిచ్చారు. ప్రపంచ దేశాలు రష్యాలో పెట్టిన పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకుని ఉక్రెయిన్లో పెట్టాలని కోరారు. రష్యా వల్ల మరో యుద్ధం జరగకుండా ప్రపంచ దేశాలు ఐకమత్యంగా ఉండాలన్నారు.

రష్యాపై ప్రపంచ దేశాలు అన్నీరకాలైన ఆంక్షలను విధించాలని ఉక్రెయిన్ కు చెందిన ఐదుగురు ఎంపీలు దావోస్ వేదికగా ప్రపంచ దేశాలను కోరటం గమనార్హం. మొత్తం మీద ఆర్థిక సదస్సులో జెలెన్ స్కీ ఇచ్చిన పిలుపు చర్చనీయాంశంగా మారింది. అయితే జెలెన్ స్కీ పిలుపు పెద్దగా ప్రభావం చూపుతుందని ఎవరు అనుకోవడం లేదు.

ఎందుకంటే రష్యాపై అనేక విధాలుగా ప్రపంచంలో చాలా దేశాలు ఆధారపడున్నాయి. నాటో దేశాలతో పాటు యూరోపులోని అనేక దేశాలు రష్యా నుండి వచ్చే గ్యాస్, బొగ్గు, సహజవాయువు సరఫరాపైనే ఆధారపడున్నాయి. రష్యా నుంచి గ్యాస్ ఆగిపోతే దాదాపు 20 దేశాల్లో పరిస్ధితులు తల్లకిందులైపోతుంది. రష్యా నుంచి బొగ్గు సరఫరా ఆగిపోతే చాలా దేశాలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాయి.